పుట:Aandhrakavula-charitramu.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కేతన

కేతన యనెడు కవి తిక్కనసోమయాజి కాలమునం దున్నవాఁడు. ఈ యంశ మీతని యాంధ్రభాషాభూషణమందలి యీ క్రింది పద్యమువలనఁ దేటపడుచున్నది.

            గీ. 'కవిత చెప్పి యభయ కవిమిత్రు మెప్పింప
                నరిది బ్రహ్మ కైన నతఁడు మెచ్చఁ
                బరఁగ దశకుమారచరితంబు చెప్పిన
                ప్రోడ నన్ను వేఱె పొగడ నేల ?'

దీనివలన నితఁడు తిక్కనసోమయాజి కాలమువాఁడగుట స్పష్టపడినందున, ఇతఁడు పదుమూడవ శతాబ్దమధ్యమున ననఁగా నిప్పటికి రమారమి యాఱు వందలనలువది సంవత్సరముల క్రిందట నున్నాఁడనుట నిశ్చయము. ఇతడాంధ్రభాషాభూషణమును రచించుటకు ముందు తెలుఁగునకు వ్యాకరణ మేదియు లేదనుట నన్నయభట్టారక చరితమునం దుదాహరింపఁబడిన పద్యమువలననే కాక యాంధ్రభాషాభూషణమునందలి యీ క్రింది పద్యము వలనను దేటపడుచున్నది.

            ఉ. క్రొత్తగా నాంధ్రభాషకును గొంచక లక్షణ మిట్లు చెప్పునే
                యుత్తమ బుద్ధి యీతఁ డని యోరలవోవక విన్నఁజాలు మీ
                రొత్తిన మీకు మాఱునకు నుత్తర మిచ్చుట చాల యెగ్గు మీ
                చిత్తమునందు న న్నెరపు సేయకుఁడీ కవులార ! మ్రొక్కెదన్.

            క. నేరములు కాళిదాస మ
                యూరాదులకై నఁ గలుగు నొరులకు లేవే!
                సారమతు లైన సుకవుల
                కారుణ్యమె నేర్పుకలిమి కవిజనములకున్."