పుట:Aandhrakavula-charitramu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

252

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

వివాదాస్పదములైన కవి చరిత్రములలో సోమనాధుని చరిత్ర మొకటి. ఇతని జన్మస్థానమునుగూర్చియు, కులగోత్రములనుగూర్చియు, కాలమును గూర్చియు విభిన్నాభిప్రాయములు కలిగి వాదోపవాదములు ప్రబలినవి. ఈవిషయములంగూర్చి ప్రత్యేక గ్రంథములే వెలువడినవి. వాని సారాంశము మాత్ర మిచట తెలుపcబడును.

సోమనాధుని నివాసము తెలంగాణాలయందలి 'పాల్కుఱికి" యని పెక్కురు విమర్శకు లభిప్రాయపడియున్నారు. "పండితారాధ్యచరిత్ర"ను పరిష్కరించి, విపుల విమర్శనమును వ్రాసిన శ్రీ చిలుకూరి నారాయణరావుగారు మైసూరు రాష్ట్రములో తుమకూరు పరిసరముననున్న "హాల్కురికి' యే సోమనాధుని జన్మస్థానమని తెలిపిరి. *ఆంధ్రకవితరంగిణి" కారులు శ్రీ నారాయణరావుగారితో నేకీభవించిరి "తెనుగు కవుల చరిత్ర"లో తెలంగాణాలో నేఁడు కానవచ్చు 'పాలకుర్తి' యే సోమనాధుని నివాసమగు 'పాల్కుఱికి' యని వివరింపఁబడి యున్నది.

సోమనాధుడు, తాను 'భృంగిరిటి" గోత్రుఁడనని చెప్పి యుండెనే కాని కుల గోత్రములను వివరింపలేదు కావున నీతఁడు బ్రాహ్మణేతరుఁడై న జంగముఁడని శ్రీబండారు తమ్మయ్యగారు వాదించుచున్నారు. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు మున్నగు వారీతఁడు బాహ్మణుఁడని నిరూపించి యున్నారు, పరంపరాయాతమగు జనశ్రుతినిబట్టి యీతఁడు కౌండిన్య గోత్రజుఁడని తెలియుచున్నదని శ్రీ వేంకటరావుగారు "తెనుఁగు కవుల చరిత్ర" లో (పుట 324) వివరించిరి "కులగోత్రముల ప్రసక్తి లేని వీరమాహేశ్వరాచారము స్వీకరించిన వెనుక, సోమనాధుఁడు తత్సంప్రదాయము ననుసరించి తా నీశ్వర కులజుఁడననియు, భక్తి గోత్రుఁడననియు, పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రులనియు చెప్పుకొన్నాడు." అని వేంకటరావుగారి యభిప్రాయము. దీనినే పెక్కురు విమర్శకులు సమ్మతించుచున్నారు

సోమనాధుఁడు తాను గురులింగ తనూజుఁడనని యనుభవసారమునఁ జెప్పి యున్నను-- తన తల్లిదండ్రులు రామవిష్ణుదేవుడు, శ్రయాదేవియని బసవ