పుట:Aandhrakavula-charitramu.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

203

పా వు లూ రి మ ల్ల న

      చ. చెలికి షడంశమున్ బ్రియకు శేషములోపలఁ బంచమాంశమున్
         బొలుపుగ దాని శేషమున బోదకు నాలవపాలు నిచ్చి యం
         దులఁ దన పాలు దాఁ గొనియెఁ దొమ్మిది జేనలు రాజహంస మీ
         నలిన మృణాల మెంత సుజనస్తుత ! మా కెఱుఁగంగఁ జెప్పుమా.

నే నీ కవిచరిత్రమును వ్రాసి ప్రచురించిన తరువాత కొందఱు రాజరాజ నరేంద్రుఁడు నవఖండవాడ యిచ్చినది గణితము చేసిన మల్లనకుఁ గాదనియు నాతని తాత యైన మల్లన కనియు వార్తాపత్రికలలో వ్రాసి యున్నారు అందుచే నే నీ సంవత్సరమునందు బెంగుళూరికి బోవునపు డొక దినము చెన్నపురిలో నిలిచి ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారమునకును, నాంధ్రసాహిత్య పరిషత్పుస్తకభాండాగారమునకు బోయి యందున్న పావులూరి గణితములను జదివితిని. ఆంధ్రసాహిత్య పరిషత్పుస్తకభాండాగారములోని ప్రతులలో నొకదానియందు

     ఉ. 'శ్రీలలనేశుc డాంధ్రనృపశేఖరుఁ డై చనురాజరాజ భూ
         పాలకుచేతఁ బీరపురపార్శ్వమున న్నవఖండవాడ యన్
         ప్రోలు విభూతితోఁ బడసె భూరిజన స్తుతుఁ డైనసత్కళా
         శీలుఁడు రాజపూజితుఁడు శివ్వనపుత్రుఁడు మల్లఁ డున్నతిన్.

      క. గోత్రపవిత్రుఁడు సద్గుణ
         పాత్రుం డగు శివ్వనకును బతిహితశుభచా
         రిత్రారుంధతి గౌరమ
         ధాత్రీపతి కిరువురకును దనయుండ జగతిన్.'

అనియు, నింకొక ప్రతియందు

      ఉ 'శ్రీలలనేశుఁ డాంధ్రనృపశేఖరుఁడై .................
          ................ సివ్వనపుత్రుఁడు మల్లఁ డున్నతిన్.

      ఉ. శ్రీనిలయుండు సివ్వనయుఁ జిమ్మనయుం గుణసూర్యదేవుఁడున్
          ధీనిధి ప్రోలనార్యుఁడును దేజమునన్ రవితుల్యులై_న యీ
          సూనుల నల్వురం బడసె సూరిజన స్తుతున సత్యవి
          జ్ఞానులు పద్మగర్భు వదనంబులు నాలుగుఁబోలువారిలోన్