పుట:Aandhrakavula-charitramu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

141

తి క్క న సో మ యా జి

ఈ యల్లాడమంత్రి తిక్కనసోమయాజి మనుమరాలిభర్త; కవి సింగన్న యల్లాడమంత్రి మనుమడు. తిక్కనసోమయాజిపుత్రుఁడు కొమ్మన: కొమ్మనకూఁతురు చిట్టాంబ కల్లాడమంత్రివలనఁ గలిగిన పుత్రుఁ డయ్యల మంత్రి; అయ్యలమంత్రి పుత్రుడు గ్రంథకర్త యైన సింగన్న. ఈ కవి తాను పద్మోత్తరఖండమును రచించిన కాలము శకవర్షము 1344 అయినట్లా పురాణమునం దీక్రిందిపద్యమునఁ జెప్పియున్నాడు.

                       మంగళమహాశ్రీ వృత్తము
        "ఆకరయుగానలమృగాంకశకవత్సరములై పరఁగు శార్వరిని బుణ్య
         ప్రాకటితమార్గశిరపంచమిని బొల్చు నుడుపాలసుతవాసరమునందున్
         శ్రీకరముగా మడికి సింగన దెనుంగున రచించెఁ దగఁ బద్మపురాణం
         బాకమలమిత్రశిశిరాంశువుగఁ గందసచివాగ్రణికి మంగళమహాశ్రీ."

ఈ పుస్తకము శాలివాహనశకము 1344 శార్వరి సంవత్సర మార్గశిర పంచమీ బుధవారమునం దనఁగా క్రీస్తుశకము 1422 నందు ముగింపఁబడెను. ఈ కవికిని తిక్కనసోమయాజికిని నడుమను మూఁడు తరములు మాత్రము చెల్లినవి. ఒక్కొక్క తరమున కంతరము నలుబదేసి సంవత్సరములచొప్పునఁ జూచినను తిక్కనసోమయాజి 1300 సంవత్సరప్రాంతమున నుండి యుండవలెను. పయి పద్యములలో మొదటి దానియందు "తిక్కనసోమయాజులపౌత్రుఁడై కొమరారు గుంటూరికొమ్మ విభుని" అను పాఠము కొన్ని ప్రతులలోఁగానఁబడు చున్నది. అది ప్రమాదజనితమైన యపపాఠము. కొమ్మన్న సోమయాజుల పుత్రుఁడు గాని పౌత్రుఁడు గాడు. సోమయాజులవంశజులలో నిప్పుడు జీవించియున్న పాటూరి శరభరాజుగారిచే నీయఁబడిన వంశానుక్రమణిక యీ విధముగా నున్నది.

         సీ. 'భారతపర్వము ల్పదియేను వరుసగాఁ
                    దెనిఁగించె గుంటూరితిక్కయజ్వ
              యా మహాత్ముని పుత్రుఁడౌ కొమ్మనఘనుండు
                   కల్పించెఁ బాటురికరిణికంబు