పుట:Aandhrakavula-charitramu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

          ప్రకటగణగణసంపదఁ బరఁగుచున్న
           ధన్యుఁ డథిగత వృషుఁడు ప్రతాపరుద్ర
           దేవసామ్రాజ్యవర్ధనస్థిరవినీతి
           కరణకుశలుండు నాగయగన్నవిభుఁడు.'

మార్కండేయపురాణ గద్యమునందు మారన 'శ్రీమధుభయకవిమిత్ర తిక్కనసోమయాజి ప్రసాదలబ్ధసరస్వతీపాత్ర తిక్కనామాత్యపుత్ర' యని వ్రాసికొని యుండుటచేత నతఁడు తిక్కనసోమయాజిశిష్యుఁ డగుటకు సందేహము లేదు. మారన తండ్రి యైన తిక్క-నామాత్యుఁడు కవి తిక్కన్న గాక వేఱొక్క తిక్కన్న యయి యున్నాఁడు.

ప్రతాపరుద్ర దేవుఁడు 1295 వ సంవత్సరము మొదలుకొని 1323 వ సంవత్సరమువఱకును రాజ్యము చేయుటయు, ఈ కడపటి సంవత్సరమునం దతఁడు ఢిల్లీచక్రవర్తియైన జిల్లాలుద్దీను మేనల్లుఁడును అయోధ్యనబాబు నయిన అల్లా-ఉద్దీన్ చేత పట్టుకోఁబడి ఢిల్లీ నగరమునకుఁ దీసికొని పోఁబడుటయు సుప్రసిద్దములు. ఈ పయి నిదర్శనముల నన్నిఁటిని పరిశీలించి చూడఁగా తిక్కనసోమయాజి పదుమూడవ శతాబ్ద మధ్యమున నుండె ననియు ఈ కవికిని నన్నయభట్టారకునికి మధ్య రెండు వందల సంవత్సరము లెడమున్నదనియు, నిశ్చయింపవలసి యున్నది. కాబట్టి తిక్కనసోమయాజి యిప్పటి కాఱువందలయేఁబది సంవత్సరముల క్రిందట నుండి యున్నాఁడు.

తిక్కనసోమయాజి నన్నయభట్టు కాలములోనివాఁడు కానట్టును, హూణ శకము పదమూడవ శతాబ్దమునందే యుండినట్టును స్థాపించుటకయి మరి కొన్ని నిదర్శనములు కూడఁ గనఁబడుచున్నవి. మెకాంజి దొరగారు సంపాదించి చెన్నపురి రాజకీయప్రాచ్యలిఖితపుస్తక నిలయమునం దుంచిన వ్రాఁతప్రతులలో నొకదానియందుఁ దిక్కనసోమయాజి శాలివాహనశకము 1120 వ సంవత్సరమునం దనఁగా హూణశకము 1198 వ సంవత్స రమునందు మృతినొందెనని చూపెడి యీ క్రింది పద్య మొకటి కానఁబడు చున్నది.