రహస్యము లెఱుంగరానివి. కావున తమకీ రహస్యము లింత సులభముగ నెట్లు తెలియవచ్చెనో ఆశ్చర్యముగ నున్నది." అని బల్కెను. అర్హతు డపుడు "దేవుడా! నీవు బల్కినది సత్యము. ఇది యంతయు తథాగతుని ప్రజ్ఞయే" అని యనుచు ఆసనము నుండిలేచి బోధిసత్త్వునకు సాష్టాంగముగ బ్రణమిల్లి స్తుతించి పూజించెను."
చరిత్రకారులు చాలమంది యుఆన్ చ్వాంగ్ ధాన్యకటక దేశమునుండి దక్షిణమున కావేరి తీరమున గల చోళదేశమునకెట్లు ముందు పోగలిగెనా యని సందేహించి యాతడు వ్రాసినదానిని ఖండింప నారంభించిరి. కాని వారి ఖండనములు ఆశ్చర్యముగను ఆధార రహితములుగను గన్పట్టుచున్నవి. యుఆన్చ్వాంగ్ వర్ణనల ప్రకారము ఆతడు బేర్కొని యుండిన దేశము ఇప్పటి కర్నూలు మండల మగుచున్నది.[1] ఈప్రాంతమును మనయాత్రికుని కాలమున తెలుగుచోడ వంశములు బరిపాలించు చుండినట్లును ఇయ్యది చోళమండలమని బిలువబడు చుండినట్లును శాసనములవలన దెలియుచున్నది.[2] శ్రీయుత చిలుకూరు వీరభద్రరావు పంతులుగారు చోళమండలము కడపజిల్లాయని నిర్ణయించుచున్నారు. గాని యది కేవలము ప్రమాణముగాదు. కడపమండలముగాక కర్నూలుమండలముగూడ చోళదేశమున జేరియుం