"పిమ్మట నాగార్జునుడు, తనరసశాస్త్రజ్ఞానమహిమచే చుట్టుప్రక్కలగల పెద్దబండఱాళ్ళ నన్నిటిని కరిగించి దానిలోనొక కషాయమునుబోసి బంగారపు ముద్దలుగా మార్చివేసెను. మరునా డుదయము రాజు ఎక్కడ జూచినను ఱాళ్ళవంటి బంగారపుముద్దలను గాంచి యాశ్చర్యము నొందుచు, తన సంతోషమును బట్టజాలక, నాగార్జునునికడ కేతెంచి ప్రణమిల్లి తాను అడవియందు ద్రిమ్మరుచు నచ్చటచ్చట సువర్ణమును ఱాతిబండలువలె, కుప్పలుగా బడియుండుట గాంచితి ననియు నది దేవతల మహిమచే జరిగెను గాబోలుననియు విన్నవించెను. నాగార్జును డపుడు 'రాజా! అట్లు దేవతాప్రభావముచేత జరుగలేదు; నీ మనశ్శుద్ధివలనను నీ కార్యదీక్షాపరత్వమువలనను గలిగిన ఫలమిది. ఇపుడు నీకు గావలసినంత ధనము సమకూరినదిగావున నీవు తలపెట్టిన పుణ్యకార్యమునకై దీని నంతయు వినియోగింపుము. నీ యభీష్టము ఫలించుగాక" యని ప్రత్యుత్తర మిచ్చి ఆశీర్వదించెను. రా జాబోధిసత్త్వుని యానతిచొప్పున నా ధనమును వినియోగించెను. సంఘారామము నిర్మింపగా మిగిలినదానితో, సువర్ణమణిమయాంచితములయిన బుద్ధదేవుని ప్రతిమలను జేయించి విహారములందుంచెను. ఇంకను మిగిలిన ధనము రాజ్యాభివృద్ధికై వినియోగించెను.
తాను నిర్మించిన యాసంఘారామములందు నివసించుచు బుద్ధదేవునికి బూజానమస్కారములు చేయుచుండుటకై