ములు తోరణములు ఎట్లుండెనో యూహించు కొనుటకు మాత్రము ఉత్తరమున తుంగభద్రయొడ్డున గలియు నాలుగువీథుల మొగలుగలిగి శిథిలావస్థయందున్న గోపురమంటపములు జూడ నగును.
విజయనగర రాజవీధులను అబ్దుల్రజాక్ ఇట్లు వర్ణించుచున్నాడు.
"రాజవీథులందిరుప్రక్కలను పుష్పలావికలు పరిమళము గ్రమ్ముకొను నానావిధపుష్పములను విక్రయించు చుందురు. అంగళ్ళవాండ్రు తమ యంగళ్ళముంగిట అందమైన మంచెలు గట్టుకొని అందుతమసరకుల నమ్ముకొను చుందురు. ఇట్లిరు ప్రక్కలను అంగళ్ళు, పుష్పలావికలు స్థలమాక్రమించు కొనినను, ఆశ్వికులు, కాలినడక వారు, యేనుగులు రథములు, శకటములు, పల్లకీలు మున్నగునవి గుంపులు గుంపులుగ నిసుకవైచిన రాలకుండ వచ్చుచు బోవుచుండుటకు వీలయినంత వెడల్పుగా నీరాజవీథులున్నవి. ఈవీధులు చాలపొడుగై కనుచూపుమేఱకు వ్యాపించియుండి నేడు మనోజ్ఞమయిన దృశ్యము నొసంగుచున్నవి. ఎచ్చట చూచినను పరిమళ భరతములయిన వివిధజాతుల దివ్య కుసుమములే కానవచ్చు చుండును. అన్ని పుష్పములలో నీదేశీయులకు గులాబి (గొజ్జంగి) పూవులన్న మిక్కిలి యిష్టము. అవి విశేషముగా దొరకును. ఇచ్చటి ప్రజలకు పువ్వులనిన బ్రాణము. ఆహారమెంత యావశ్యకమో పూవులంతావశ్యకము. భోజనమైన లేకుండ బోవుదురుగాని స్త్రీపురు