మన యాత్రికుడు వర్ణించిన సప్తప్రాకారములను గూర్చి యొక్కింత దెలుపవలసియున్నది.
విజయనగర వెలిప్రాకారములో మొదటిది హొస్పేటకు నైఋతిదిక్కుగా నున్నది. అచ్చటను గల రెండుకొండల నడుమ గల పెద్ద తటాకమునకు బశ్చిమముగా అబ్దుర్ రజాక్ వర్ణించిన మొదటి దుర్గద్వారము గలదు. ఆదుర్గ సమీపమునగల పెద్దచెఱు విపు డెండిపోయినది, గాని యానగర ముచ్చదశయందుండిన కాలమున, మిక్కిలి లోతుగా నుండి మంచినీరుతో నిండియుండెను. ఆచెఱువు నడుమ నొక బలిష్ఠమైన దుర్గ మిప్పటికిని కలదు. అందు రక్షకభటులు కావలిగాయుచుండెడివారు. రెండవప్రాకారము హొస్పేటకు సమీపములో నుండెను. హొస్పేట (నాగలాపురము) ఆకాలమున జనసమ్మర్దముగా నుండినట్లు అబ్దుర్ రజాక్ వర్ణించుచున్నాడుగదా! మూడవప్రాకారము హొస్పేట కుత్తరముగా బోయియుండవలయును. అదియిపుడు గానరాదు. నాల్గవ ప్రాకారమునందు బలిష్ఠమైన కవాట మున్నది. ఈగోడ "మల్పనగుడి" గ్రామమునకు దక్షిణముగా బోవును. మల్పనగుడి యిప్పటికినిగలదు. పూర్వ మీపేటలో సామంతమండలేశ్వరులు నివసించుచుండినట్లు శిథిలావస్థయందున్న సౌధములు, ఆరామములు మొదలయినవి చాటుచున్నవి. అయిదవ గోడ యీగ్రామమున కుత్తరముగా బోయినది. ఆగోడ చాలభాగము శిథిలమయి పోయినదిగాని, యందలి దుర్గద్వారము