లయపు గోడను పరీక్షించినను, అచ్చట వెలసియున్న దేవునికి, నిత్యదీపారాధనమునకై వలయు నేయికి, భక్తు లెందరో నూర్లకొలది గొఱియలను, మేకలను దానములు చేసి యున్నట్లు వ్రాయించ బడియున్న శాసనములు గాననగును. ప్రతిదేవ కిలారము నందును గొల్లబోయల వశమునం దుంచబడిన పశులమందలే, లెక్కపెట్ట నలవిగాకున్నపుడు, ఇక జనుల యుపయోగర్థ మెన్నియుండెనో యూహించుకొన వలసినదేగదా!
అన్నిటికంటె మార్కోపోలో ఈదేశము నేలుచుండిన మహారాజ్ఞిని, విశేషముగా గొనియాడినాడు. ఆమెనుగూర్చి యీత డెంతగొప్పగా వినియుండెనోగాని, యాత డామెను గూర్చి వ్రాసిన నాల్గు పంక్తులును, సువర్ణాక్షరములవలె బ్రకాశించుచు, ప్రతి ఆంధ్రుని హృదయము నందును సంతోషమును బుట్టించుచు పులకాంకితులను జేయుచున్నవి. మార్కో ఆమె ధర్మ పరిపాలనమును గూర్చి చెప్పి యామె పవిత్ర నామాక్షరములను మాత్రమును దెలుపలేక పోయినాడు. అయిన నాతని కాలము మనకు దెలియును గావున, నాతడు బేరు దెలుపకున్నను ఆకాలమున నాంధ్రదేశము నేలిన పడుచుపేరు మనము గ్రహింపవచ్చును. మార్కోపోలో బేర్కోనిన మహారాజ్ఞి నామము రుద్రమదేవి యని ఆంధ్ర చరిత్రకారులగు శ్రీ చిలుకూరి వీరభద్రరావు పంతులుగారు సుప్రసిద్ధ పరిశోధకులగు డాక్టరు హుల్ట్జ్ గారు