పుట:2030020025431 - chitra leikhanamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పైఁజెప్పినవానియం దభ్యాసమైనతరువాత వివిధమైన రంగులతో చిత్రములను వ్రాయ నభ్యసింపవలెను.

ఒక కాగితమును తీసికొని దానిని డ్రాయింగు ఫలకమునం దంటించి రంగును పూయుటకు సిద్ధపఱుపవలెను. రంగును చాల పలుచగా కలిపి యొక చిన్నగాజుపళ్లెము (slant) నం దుంచవలెను. తరువాత శుభ్రమైన కుంచెను తీసి రంగునందు ముంచి కాగితముపై వేయుట ప్రారంభింపవలయును. ఈరంగు చిక్కగ నుండిన సమానముగ వచ్చునటుల పూయజాలము. రంగును మీదినుండి క్రిందికి పూయుచుండవలెను. కుంచె నెప్పుడును క్రిందికే జరుపుచుండవలెను. కాని మీదికి జరుపరాదు. ఇటుల చేసినయెడల చిత్రము చెడిపోవును. డ్రాయింగు ఫలకము ఏటవాలుగ నుండిన సదుపాయముగ నుండును.

ఈరంగు పూసినతరువాత బాగుగ నారనీయవలెను. తడిగానున్నపుడే రెండవపర్యాయము రంగును వేసిననొకచోట పలుచగను, నొకచోట దట్టముగ నంటుకొనును. ఇటులనే అనేకపర్యాయములు పలుచని రంగును పూసి దట్టముగ రంగంటుకొనునటుల చేయవచ్చును.

ఇటుల వేయగలిగినతరువాత వలయాకారమును పెన్సిలుతో చుట్టి దానియందు రంగును పూయుచుండవలెను.

క్రొత్తవారు దట్టముగ రంగును పూయుట కిచ్చగించెదరు. రంగును పూయుటయం దభిలాషను పుట్టించుటకు సులభమైనటువంటి వివిధమైన చిత్రములను వ్రాసి వానియందు రంగును పూయుచుండవలెను. వీనికనుకూలమైనవి వివిధదేశపు బావుటాలే. ఇవిగాక 29 - వ పటములో చూపినవి వ్రాయవలెను. 29 - చూడుము.


వీనియం దభ్యాసమైనతరువాత వివిధమైన వస్తువులను వ్రాసి వానికనుగుణమైన రంగులను పూయుచుండవలెను.

ఆకును వ్రాసి యాకుపచ్చను దట్టముగ పూయవలెను. నారింజపండును వ్రాసి నారింజరంగును వేయవలయును. నిమ్మపండును వ్రాసి పసుపును పూయవలెను.

ఇటులనే చెట్లనుకూడ వ్రాయవచ్చును. చిక్కనియాకుపచ్చను తీసికొని చెట్టుకొమ్మలవలె కాగితమునందుపూసి మట్టిరంగు (Burnt Sienna) తో మొండెమును చిత్రింపవలెను. ఈచెట్లను వ్రాయువిషయమై మఱియొక ప్రకరణమునందు చెప్పెదను.