పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

11. కృత్యంతరములు

నీతిసంగ్రహము

నీతిసంగ్రహ మను నీ గ్రంథము చిన్నయసూరిచే ప్రాచీన కవులనుండి ఏర్చి కూర్పఁబడినది. అందులోను ముఖ్యముగా భారతమునుండి ఆయా సందర్భములనుండి గ్రహింపఁబడినవి, చిన్నయసూరి అచ్చటచ్చట తాను స్వంతముగా రచించిన పద్యములనుకూడ చేర్చియున్నాఁడు. ఇందు నూఱు పద్యములు గలవు. ఇవన్నియు నీతి బోధకములే. దీని కొక టిప్పణిగూడ నుండుటచే నాలుగైదు తరగతుల బాల బాలికల కవశ్య పఠనీయముగా నుండెడిది.

ఇందుఁ గందపద్యములు తేటగీత లాట వెలఁదులు 104 పద్యములు గలవు. మచ్చునకు రెండింటి నుదాహరింతును -

                 శ్రీ నొసఁగు యశము వెంచు న
                 నూనప్రమదంబుసేయు నురుదోషంబుల్
                 తో నడుచుఁ గరము విమల
                 జ్ఞానము మెఱయించు సాధుసంగతిఁ దలపన్.

భారతాది గ్రంథములనుండి పద్యములు గలవు.

                 జ్ఞానసిద్ధికంటెఁ జర్చింప సకల సి
                 ద్ధులును లొచ్చు గానఁ దొలుత దాని
                 గడనసేయవలయు నెడపక దాన న
                 నూనమైన సౌఖ్యమొందు నరుఁడు.