పుట:2015.497290.chinnayasuuri-jiivitamu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్నయసూరి జీవితము 81

పూర్వనిఘంటువులు - పద్యకృతులు

వీనిలో మొదటిది పైడిపాటి లక్ష్మణకవి కృతమగు 'ఆంధ్రనామసంగ్రహము'. దీనిలో లేని విశేషములను అడిదము సూరకవి 'ఆంధ్రనామ శేషము'న రచించెను. ఇవి కళింగ దేశములోనివి. రాయలసీమలో *[1] కవిచౌడప్ప సీసము లనుపేర నొక నిఘంటువు నిర్మించెను. దక్షిణాంధ్రదేశమున గణపవరపు వేంకట కవి 'వేంకటేశాంధ్రము'ను, కస్తూరి రంగకవి 'సాంబనిఘంటువును' వెలసినవి. కాని, వీని యన్నింటికన్న పుదుక్కోటలో వెలసిన 'ఆంధ్రభాషార్ణవము' అను నాంధ్రామరము చాల ప్రసిద్ధి వడసినది; సర్వాంధ్రదేశమున ప్రచారమున నున్నది. దీని వెనుక విశేషాంధ్రము, సర్వాంధ్రసార సంగ్రహము. దేశ్య నామాంత కోశము, ఆంధ్ర పదాకరము మున్నగు తెనుఁగు నిఘంటువులు బయలు వెడలినవి. కాని, వీనియందు నేవిధమైన ప్రత్యేకతయు లేదు. ఇవియన్నియు పద్యమయములే. కావున నవీనులకు సుగ్రాహ్యములై యుపయోగకరములు కావు. ఇంతేకాక యివి కావ్యములలో ప్రయుక్తములైన పదములను మాత్రమే విపులముగా నర్థీకరించునుగాని యెక్కుడు పదజాలము ప్రదర్శింపఁజాలవు.

  1. * దీనిని తొలుత శ్రీ నిడుదవోలు శివసుందరేశ్వరరావు (యన్. యస్. యస్. రావు) ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారము బులెటిన్ లో ప్రకటించి లోకమునకు వెల్లడించినాఁడు.