హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము
గ్రంథ ప్రకాశక విజ్ఞప్తి
చిన్నయసూరి వచన రచనలలో నీతిచంద్రిక వెనుక మన కీనాడు లభ్యమైనది హిందూ ధర్మశాస్త్ర సంగ్రహము. ఇది న్యాయశాస్త్ర గ్రంథమని దీని పేరే తెలుపుచున్నది. ఇదియు తొలుత క్రీ. శ. 1858 లో బాలవ్యాకరణము ముద్రితమైన వెను వెంటనే ముద్రితమైనది. ఆ వెనుక, క్రీ. శ. 1867, 1869 లలో *[1] ద్వితీయ, తృతీయ ముద్రణము లందినదన్న, దీని కా కాలమునఁ గల వ్యాప్తి నిగ్రహింపవచ్చును. క్రీ. శ. 1880 - 90 ప్రాంతములలోఁగూడ నీ గ్రంథము రెండవ తరగతి న్యాయవాదులు ప్లీడరు పరీక్షా పఠనీయ గ్రంథముగా చదువుచుండిరని తెలియుచున్నది.
రాజకీయముగా నీ గ్రంథము వ్యాప్తిలో నున్నను సారస్వత లోకములో నిది ప్రచారము గాంచక పోవుటకు కారణము మూఁడు ముద్రణ ప్రతులును నీదేశమున లభ్యము కాక పోవుటయే. ప్రథమ ముద్రణ ప్రతిని లండను నగరమున బ్రిటిషు మ్యూజియము గ్రంథాలయమునుండి ♦[2] చలన చిత్ర ఛాయాగ్రహణ మూలమున బడసి, దీనిని ప్రకటించితిని.