సప్తమాంకము
ప్రథమస్థలము : అడవి
[లక్ష్మణుఁడు ప్రవేశించును]
లక్ష్మ : దు:ఖగర్భితములగు పండ్రెండువత్సరములు గడచినప్పటికిని రామపత్నిని విడనాడిన యీ కాంతారస్థలముల దర్శింప, సీతాపరిత్యాగ సంతాపము నేఁటిదివలె నాహృదయతటము లొరసికొనుచుఁ బ్రవృద్ధమగుచున్నది.
ధరణిజా పదన్యాస పూతంబులైన
యటవులించుక మార్పుతో నైనఁగాంచ
నయ్యెఁగాని సీతాకార మాత్మఁ దక్క
దృశ్యలోకంబు ననునెందుఁ దేజరిలదు.
సీతావిరహితమైన యశ్వమేధము దు:ఖకరమైనను దన్మూలమున ఆర్యాపునర్దర్శనము లభించు నేమోయను కొండంత యాసతో వచ్చితిని. నా యాస నిద్రమేల్కొన్నవాని స్వప్నమువలె అదృశ్యమయ్యెను. [కొంత నడచి] అకటా ! నేనెంత ప్రాణఘాతుకుఁడను. అగ్రజుని యాజ్ఞగావించి మరణపర్యంతము వేధించు హృదయశల్యము దెచ్చికొంటిని.
రామసందేశ మేఁ దెల్పఁ గోమలాంగి
జానకీదేవి ప్రాణవిహీన యగుచు