ప్రథమాంకము] సీతావనవాసము 5
ప్రళయ రుద్రార్క చండ విభ్రాజ తేజుఁ
డైన దశకంఠునకు రాజధాని లంక !
నేఁటి కెట్లాయె - నక్కటా ! నేలమట్ట
మాయె దుష్టదైవము మాకు దాయయౌట.
ఔరా ! రాక్షసులకు వినాశము ! సురేంద్రుని పరాభవించిన మేఘనాదుండు మడసె. అవార్య శౌర్యబలసాహసుండు కుంభకర్ణుండు కాల వశంవదుఁడయ్యె. మాల్యవదాది రాక్షసవీరనాయకులు శరతల్పము లలంకరించిరి. చతుర్దశభువన విద్రావణుండు రావణుండుపరాభూత భుజవీర్యుండై రణక్రోడశాయి యయ్యె.
కైలాసేశ్వరు వెండికొండ వడఁకంగాఁ జేత నూఁగించి, ది
క్పాల శ్రేణికి నాజ్ఞవెట్టి, మునులం గారించి, నైలింప క
న్యాళిం దెచ్చి నవగ్రహంబులను గారాగారమం దుంచి శౌ
ర్యాలఁబంబుగ రాజ్యమేలిన సురేంద్రారాతియుం గూలెఁగా!
వీరవతంసులకు విరోధి సైన్యంబులఁ జీల్చి చెండాడి విజయలక్ష్మిని వరించుటయో లేక యాత్మోచిత మరణంబునొంది స్వర్గభోగలాలసు లగుటయో ధర్మముగాని, రాక్షసయోధులకు ఇంతటి యధ:పతనము తగునా !
మరణము నైజమెల్లర, కమానుష దోర్బల సాహసాంకు లా
సుర నికరంబు, లట్టిరికి శూరులు వోయెడి త్రోవలెస్స గా
ని, రణమునన్ నరాశనుల నిశ్చల యోధవతంసులట్ల వా
నరులు నరుల్ జయించిరన నా కుదయించెడి లజ్జపెల్లుగన్.