పుట:2015.392383.Kavi-Kokila.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68 కవికోకిల గ్రంథావళి [షష్ఠాంకము

[మాండవ్యుఁడు, సానందుఁడు ప్రవేశింతురు.]

సానం : అమ్మా.

సీత : నాయనా, యేమి?

సానం : మీ కుశలవులను గట్టుదిట్టము సేయకున్నఁ బ్రాణాపాయము గలుగును.

సీత : సానందా, యేల యిట్లు పలుకుచున్నావు? వా రేమిచేసిరి?

సానం : కొదమను లాగివైచి తల్లిసింగమును పాలు పితుకుచుండిరి. మేము అది యేమిపనియన్న మాపైకి సింహకిశోరమును విసరి భయ పెట్టిరి. నే నబద్ధమాడిన ఈ మాండవ్యుని అడుగుము.

మాండ : ఇందేమి యబద్ధమున్నది.

సీత : అయ్యో! వారికిఁ గ్రూరమృగములతో నేమి చర్లాటము ? వాల్మీకినాయనగారితోఁజెప్పి కుశలవులకుఁ దగు శిక్షచేయించెదను. మీరుపొండు.

మాండ : అమ్మా, అడవిమృగములన్న లవునకుఁ గొంచెముగూడ భయములేదు. మాబోఁటివాండ్లమే భయపడుచుందుము.

[నేపథ్యమున]

అన్నా, నావిల్లుగూడ కొమ్మకుఁ దగిలించుము.

సానం : అమ్మా, మే మిఁకవెళ్ళెదము; లవుని కంఠస్వనమువలె నున్నది. మమ్ముఁజూఁచిన సింగపుకూనను ఉసిగొల్పుదురు.

[నిష్క్రమింతురు]

సీత : కురంగములతోడఁ బంచానన కిశోరములఁ బెంచినను వాని స్వభావ మేల మానును?