పుట:2015.392383.Kavi-Kokila.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాంకము]

సీతావనవాసము

౫౯

ద్వితీయ స్థలము : అంతర్భవనము

[రామ భరత వసిష్ఠులు కూర్చుండి యుందురు]

రాము : తమ్ముఁడా, నేనెంత కరుణాశూన్యుఁడను ?

                   చేతులారంగఁబెంచి చేఁజేతఁ బూవ
                   నున్న మల్లికఁ బెకలించు తెన్నుగాఁగఁ
                   బ్రాణములకన్న మిన్నయై పరగు ప్రియను
                   ఘోరకాంతారములఁద్రోసి కూళనైతి.

భర : అన్నా, నీవేయిటులఁ జింతించుచున్న మాబోంట్లగతి యేమి?

వసి : వత్సా రామచంద్రా, సర్వమెఱింగిన నీవే యిటుల నడుకానఁ బడుచున్నావు.

రాము : అంతపుణ్యము నా కలవడునా ?

వసి : గంధ సింధురము పంకనిమగ్నమైన దాని నుద్ధరించు వారలెవ్వరు? నీశోకమును దిగమ్రింగి తమ్ములను బుజ్జగించ వలసినవాఁడవు గదా.

రాము : మునీంద్రా, జానకిని దిగమ్రింగినవాఁడను, శోకమును దిగమ్రింగలేనా? కొండలు మ్రింగువానికి గండశిల లొక లెక్కయా?

భర : అన్నా, నీపరితాపమునకు మేరయే దొరకకున్నది. మాయల్పధైర్యముగూడ ప్రవాహ సంఘర్షణమున నైకతబంధమువలె కరఁగిపోవుచున్నది.

వసి : భరతా, యుమ్మలింపకుము, మీయన్న నూరడింపుము. చింతింప నేమి లాభముగలదు?