పుట:2015.392383.Kavi-Kokila.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము] సీతావనవాసము 55

సీత : [స్వగతము] శీఘ్రమే మరణించునట్లు దీవింపరుగదా.

వాల్మీ : బిడ్డా, యోగదృష్టిప్రభావమువలన నంతయు దెలిసికొంటిని. కర్మవశంబున సత్యవంతులకైన, నిక్కట్టులు గలుగుచుండును. సంసార సాగరమున మునిఁగినవారలు సుఖదు:ఖ తరంగ తాడితులు గాకుందురా?

సీత : మునీంద్రా, నిరపరాధులును శిక్షార్హు లగుదురా?

వాల్మీ : అమ్మా, నీ వమాయికవు. నిరపాయకరజీవనము సల్పుచు అరణ్యమున నివ్వరుల నేరికొని తిని బ్రతుకు శకుంత సంతానములు సైతము వ్యాధుని యంపకోలకు గురియగుట లేదా?

సీత : మహాత్మా, లోకు లవివేకులైనను ఆర్యపుత్రుఁడుగూడ వారినే యనుసరింపఁ వలయునా?

వాల్మీ: అమ్మా, ఇది రాజకీయరహస్యము. రాజునకుఁ బ్రజ ప్రాణాధారము. ప్రజలు విద్వేషించి తిరుగఁబడిన సామ్రాజ్యమైనను బునాదిలోనికిఁ గూలిపోవును. కుమారీ, కాలదుర్విపాకమునకు లోఁబడనివారెవ్వరు?

                    అనిలాలోల జలప్రవాహ చలితంబై శుష్కపర్ణావళుల్
                    వెనుకన్ముందుకుఁ బోవురీతి జనులున్ విశ్వంబునం గాలవా
                    హిని నోలాడుచు నస్వతంత్రులయి యేయేవేళ నేదేది గాం
                    చనగున్ దానిఁ బరిగ్రహించి తుదకుం జాలింత్రు సంసారముల్

సాధ్వీ, ఆరణ్యకుల్యాపరిసరమున మా యాశ్రమ మున్నది. అచ్చట మునిబాలికలు నీకు సహచారిణుఁలై యుపచరింతురు, - మాండవ్యా.

మాండ : స్వామీ

వాల్మీ : నీవు శీఘ్రముగఁబోయి పరిపక్వ ఫలములు గోసికొని యాశ్రమమునకు రమ్ము.

మాండ : చిత్తము [నిష్క్రమించును.]