కవికోకిల గ్రంథావళి
రాజ : మాధవుని కంఠస్వరమువలె నున్నది.
కటి : [తొందరగ చదువును]
గండ్రగొడ్డలికి సత్తెమువుంటె కాళమ్మవుంటె
వొక్క యేటుకే మొండెమునుంచి పూడిపోవు సిరసు.
[గొడ్డలి పైకెత్తును]
రాజ : ఊడిపోదురా నరపిశాచీ, ఊడిపోదు. [ఎత్తిన గొడ్డలిని పట్టుకొనును]
కటిక : [తిరిగిచూచి] ఒయ్యొ, ఒయ్యొ, దెయ్యం, దెయ్యం. చిన్న దొరయ్య దెయ్య మయ్యాడు. [పెద్దకేకవేయును, భటులు భయపడుదురు]
రాజ : నేను మరణించితిననుకొని యుండిరా?
మాల : నేను సందేహించినట్లే యైనది. మనము సమయమునకు రాకున్న!
మాధ : [మెల్లఁగ తలయెత్తి కన్నులకు గట్టుకొని రుమాలువిప్పి] ఏమి దయ్యమురా? [రాజశేఖరుని చూచి] ఆ! నన్ను బ్రతికించుటకై స్వర్గమునుండి పరుగెత్తుకొని వచ్చితివా?
రాజ : [మాధవుని కౌఁగిలించుకొని] మాధవా, యిదియేమి దురవస్థ?
మాధ : నీవు నిజముగ బ్రతికియున్నావా? స్వప్నము కాదుకదా? [రెండు భుజములు పట్టుకొని కుదలించును]
కటిక : [భటులతో జనాంతికము] మణిశిలాగే వుండాడు. సావలేదురో, అయ్య.
మాధ : నిన్ను హత్యచేసితినని మీతండ్రి నాకు మరణదండనము విధించెను.
రాజ : అయ్యో! ఎంత ప్రమాదము. ఒక్కనిమిష మాలస్యమై యుండిన తీఱరాని దు:ఖము ననుభవించి యుందుము.