పుట:2015.392383.Kavi-Kokila.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్థలము 6 : అరణ్యము

_________

[మనోరమయు చేటికయు ప్రవేశింతురు.]

చేటిక : అమ్మా, యింక మన మింటికి మళ్ళదాం, రాణిగారితో గూడ చెప్పిరాలేదు. అన్నయ్యగారు చూస్తే కోపగించుకొంటారు.

మనోరమ : శ్యామలా, నాకు అంత:పురముకంటె ఈయరణ్యమె వేయింతలు సుఖప్రదముగనున్నది. ఇచ్చట చెట్టుచేమలు పనికిమాలిన బోధ లొనరించి ప్రాణము విసిగింపవు.

శ్యామల : తండ్రిగారు పట్టినపట్టు విడువరు; మొన్నవచ్చిన క్రొత్త దొరగారు పెద్దదొరగార్ని మచ్చుమందుసల్లి లోపఱచుకొన్నట్లుంది.

మనో : మా నాయన ఉత్సాహవంతుఁడు, సదుద్దేశముతోనే నా హృదయమును చిందఱవందఱగ త్రొక్కుచున్నాఁడు - ఏమే, మాధవుని ఈవేళ చూచితివా? రెండుదినములనుండియు నాకంటి కగపడుటలేదు.

శ్యామ : ఆయన్ని ఈనాటి ప్రొద్దున చూచాను. అమ్మా, ముందటి మాదవయ్య దొరగారుకారు- ఆనడుపు ఆచూపులు మాఱిపోయినాయి. పిచ్చివాడిలాగా తిరుగుతుంటాడు.

మనో : నా దు:ఖాగ్ని హృదయదాహకమైనను తల్లి యోదార్పుల చే కొంత చల్లవడుచున్నది. పాపము! మాధవుని ఊరడించువారెవరు? - శ్యామలా, మాధవుని గంభీర స్వభావమును నీవెప్పుడైన కనిపెట్టితివా? తన దు:ఖము వెవరితోనైన చెప్పికొనఁడు; భారమును అసహాయుఁడుగ వహించును.

శ్యామ : నిన్న మన శేకరయ్యదొరగారు ఎందుకో కోపగించుకొన్నారు. ఆయన వినిపించుకోకుండా తలవంచుకొని వెళ్ళిపోయినారు.