స్థలము 9 : యమునానదికిఁ బోవుమార్గము.
_________
[చీఁకటి. అప్పుడప్పుఁడు మెఱయుచుండును. అగ్బరు తాన్సేనులు యాత్రికులవేషములతో ప్రవేశింతురు.]
తాన్సేను : నేనెంత బ్రతిమాలుకొన్నను వినకున్నారు. మూడు దినములనుండియు మనము మాఱువేసములతో ఉదయపురమున నున్నాము. ఇచ్చట మనము నిస్సహాయులము. మన యునికి రాణా యెఱింగిన ప్రాణములతో మన శరీరములు ఢిల్లీకి పోవు. భారతసామ్రాజ్యము మీ పరిపాలనమున సుఖించుచున్నది. అట్టి మీ యమూల్య జీవితమును బ్రతి నిమిషమునందును అపాయమున కగ్గముసేయుట భావ్యముకాదు. ఇప్పుడే కదలుదము రండు.
అగ్బరు : తాన్సేన్, నే నధ:పతితుఁడను. ఉత్సహముచే దీర్ఘాలోచనము సేయ నేరక మీరాబాయిని అంత:పురమున దర్శించితిమి. అంతఁ బోక యానంద జడచిత్తుఁడనై వివేక శూన్యుఁడనై, ఆమెకు వజ్రహారమును సమర్పించితిని. అదియె యా పరమ పావన చరిత్ర మరణదండనమునకు హేతువయ్యెను. ఈ ఘోరపాతకమునుండి నే నెట్లు విముక్తుఁడను కాఁగలను. ఇందుకేమైన ప్రాయశ్చిత్తము కలదా? నా సింహాసనమైనను లేక నా ప్రాణమైనను సమర్పించి యీ పాపమును బాపుకొనఁ గలిగినయెడల నే నందుకు సంసిద్ధుఁడను.
తాన్ : అంతయు దైవికముగ జరిగినది. దైవేచ్ఛకు మానవుఁడు ప్రతికూల కల్పనము చేయఁజాలఁడు.
అగ్బ : అది దైవేచ్ఛయే యగునుగాక ! ఆదైవము మనయెడలఁ బ్రతికూలము. మాఱు వేసములతోఁ బరుల యంత:పురముఁ జొచ్చితినన్న