పుట:2015.392383.Kavi-Kokila.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116 కవికోకిల గ్రంథావళి [అష్టమాంకము

సీత : ప్రాణవల్లభా, యీదీనురాలి యపరాధములను మన్నింపుము.

[పాదములమీఁద వ్రాలును.]

రాము : [లేవనెత్తి] హృదయేశ్వరీ, నిరపరాధిని వని తెలిసియుఁ, గీర్తిలోభమున, మిషవెట్టి నిన్నుఁ గానలకంపిన యీ పాపిరాముఁడు నిన్ను క్షమియించుట కెవ్వఁడు? నీ యతి లోకపాతివ్రత్యము నీయనన్యసాధ్యమైన క్షమ మావంశము నుద్ధరించినది. మఱొకమా ఱీలోకమును నా కానందమయముగ నొనరింపుము. [స్వగతము] ఆహా ! మానవుని సుఖదు:ఖావస్థల భ్రమణము !

                    ఐంద్రజాలికుఁ డాత్మ మోహనపుఁ గుంచె
                    విసరినంతనె మాఱెడి విషయమటుల
                    నాకు నిరయంబుగాఁదోఁచు నాదు బ్రతుకు
                    స్వర్గ సన్నిభమయ్యె నీక్షణమునందు !

[ప్రకాశముగ] మునిసత్తమా, నాకృతజ్ఞత యెట్లుదెలిసికొనుటకుఁ దోఁపకున్నది. నన్నింకొకమాఱు సపత్నీకుని గావించితిరి.

వాల్మీ : వత్సా, కష్టసుఖములు లోకమునకు సహజములు; అని వార్యములు. గడచినది మఱచిపొమ్ము. వర్తమానము ననుభవింపుము. భవిష్యత్తును దృష్టిపథమున నుంచుకొనుము.

ఋషులు : రఘుకులేశ్వరా, జానకీసహితుఁడవై యశ్వమేధము నొనరింపుము. దార పుత్రవంతుఁడవై గార్హస్థ్యసౌఖ్యముల ననుభవింతువు గాక !

ప్రజలు : తల్లీ లోకమాత, అజ్ఞానుల యపరాధముల మన్నించి మమ్ము మీబిడ్డలవలె రక్షింపుఁడు.