పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈశతకగ్రంథకర్త దిట్టకవిరామచంద్రకవి. ఇతఁడు వాసిరెడ్డి వేంకటాద్రినాయఁడువారి యాస్థానకవిగఁ జిరకాల మమరావతిలో నివసించెను. అమరావతిలోని యమరేశ్వరాలయమునందలి మహిషాసురమర్దనినిగూర్చి యీశతకమును గవి రచించెనని వంశీయులు చెప్పుచున్నారు. ఈకవి శకుంతలాపరిణయము, సేతుమాహాత్మ్యము, రామకథాసారము రచించిన దిట్టకవిపాపరాజుగారి మనుమఁడు. రంగారాయచరిత్రము వ్రాసిన నారాయణకవిపుత్రుఁడు. ఈరామచంద్రకవి నిగ్రహానుగ్రహసమర్థుఁడు, ధూర్తుఁడు. ఇతనికవిత నిరర్గళధారాశోభితమై మనోజ్ఞముగా నుండును. ఇంతవఱ కీకవి గ్రంథములలో నిక్రిందివి మాత్రము లభించినవి:

1. ఉద్దండరాయశతకము
2. రఘుతిలకశతకము
8. రాజగోపాలశతకము
4. మహిషాసురమర్దనిశతకము
5. హేలావతిదండకము

6. ప్రబంధములోని కృత్యాది వాసిరెడ్డివారి వంశచరిత్రము.