ఆత్మ చరిత్రము 536
దానికి న్యాపతి హనుమంతరావుగా రధ్యక్షులు. డిశెంబరు మొదటి వారములో వెంకటప్పయ్యగారి కుటుంబమున నందఱును మిక్కిలి యలజడికిలోనయిరి. వెంకటప్పయ్యగారి పెద్దయల్లుఁడు, అక్క యు బావయు భార్యయు వలదని వారించుచుండినను వినక, సింగరాయకొండదేవళములో రెండవ పెండ్లి చేసికొనెను.
20. శుభాశుభములు
1918 వ సంవత్సరము జనవరి 5 వ తేదీని గుంటూరు పురపాలకాధ్యక్షుని యెన్నిక జరిగెను. వెనుకటి యధ్యక్షు లగు న్యాపతి హనుమంతరావుగా రొకరును, పి. యతిరాజులు నాయఁడుగా రొకరును ఈ యుద్యోగమున కభ్యర్థులు. హనుమంతరావుగారు శక్తివంచన లేక, తమవృత్తిపనులును, తుదకుఁ దమయారోగ్యము నైనను జూచుకొనక, ప్రజాసేవ లొనరించినవారు. ఐనను, పురపాలకసంఘసభ్యులలోఁ బలువుర కాయనయందు సదభిప్రాయము లేదు. ఈసమయమునఁ దమయభ్యర్థిత్వము విరమింపుఁడని వెంకటప్పయ్యగారును, నేనును హెచ్చరించినను పంతులు గారు విన లేదు. అంత జరిగిన యెన్నికలలో పంతులుగారు పరాజితులైరి. తమ యధికారకాలమున నమితముగ శ్రమపడి, ఇప డాశాభంగము గాంచిన పంతులుగారికి, దేహమున నుష్ణ మధికమై, ఆనెల చివర దినములలో పెద్దజ్వరము సోఁకెను. కొన్ని రోజుల కాయనకు స్వస్థత కలిగినను, చాలకాలమునకుఁగాని శరీరమునకు మరల సత్తువ చేరుకొనలేదు.
ఫిబ్రవరి మూఁడవతేదీని గుంటూరు కళాశాలలోఁ జిరకాలము బోధకుఁడుగ నుండిన వంగిపురము కృష్ణమాచార్యులుగారు పరలో