పుట:2015.373190.Athma-Charitramu.pdf/504

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 462

7. గుంటూరునందలియుద్యోగము

నేను విజయనగరమున నుండు కాలమునందే, పర్లాకిమిడి విజయనగరములలో నాశిష్యులగు శ్రీ బుఱ్ఱా శేషగిరిరావుగారి నాయకత్వమున 'ఆంధ్రవిద్యార్థుల' ప్రధమసమావేశము విజయనగరమున జరిగెను. ఇపుడు కాకినాడ కళాశాలాధ్యక్షులగు వెంకటరత్నము నాయఁడుగా రాసభ కధ్యక్షులు. ఈ సమావేశసందర్భమున విద్యార్థులలో నధికసంచలనము కలిగెను.

విద్యార్థులలో నధికసంచలనము కలిగిన యింకొకసందర్భ మానగరమునఁ గొలఁదికాలములోనే తటస్థించెను. బంగాళాదేశీయుఁడును, సుప్రసిద్ధవక్తయునగు విపినచంద్రపాలుగారు, ఈమాఱు రాజకీయోపన్యాసము లిచ్చుచు, నాంధ్రదేశసంచారము చేయుచు విజయనగర మేతెంచిరి. అచ్చటి పురపాలకోద్యానవనమునం దాయనగాటగు ప్రసంగములు కొన్ని జరిపిరి. దేశస్వాతంత్ర్యమును గూర్చియు, స్వదేశోద్యమమును గుఱించియు నుపన్యాసము లాయనచేసిరి. ఒకనాఁడు పెక్కండ్రు కళాశాలా విద్యార్థులు భావోద్రేకమున బడియెగవేసి, ప్రసంగమును వినుట కేగిరి. దీనికి వారలను శిక్షించు విషయమున రామానుజాచార్యులుగారు మిగుల జాగ్రత్తగ నుండి రని నే నాయనను కొన్ని దినముల పిమ్మట నభినందించితిని. పిమ్మట పాలుగారు రాజమంద్రి వెళ్లి యచట నుపన్యాసము లీయఁగా, రాజమంద్రి కళాశాలా విద్యార్థులు ఉద్రేకపూరితులై, 'వందేమాతర' చిహ్నములు గల బిళ్లలు టోపీలును ధరించి కళాశాల కేగినందుకై, ఆకళాశాలాధ్యక్షులగు మార్కు హంటరుగారు వారికి విధించిన కఠినశిక్షలవంటి కఠిన పద్ధతులకుఁ గడంగక, మా కళాశాలాధ్యక్షులు సమబుద్ధి నూనుట చేత నే అచట నేమియు నుపద్రవములు వాటిల్లకుండెను.