పుట:2015.373190.Athma-Charitramu.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50. సందిగ్ధావస్థ ! 425

అప్పటి కప్పుడే యాయన మద్రాసు పోయె నని యచటఁ దెలిసెను. పూర్వము నాకు సైదాపేటకళాశాలలో సహపాఠియైన సంతాన రామయ్యంగారు, పర్లాకిమిడి కళాశాల వదలి యిపుడు నెల్లూరుపాఠశాలలో ప్రథమోపాధ్యాయు లయిరి. ఈయన నాకు నెల్లూరులోఁ గానఁబడి, నేను పర్లాకిమిడిలోని యుద్యోగము స్వీకరించుట యుక్తమని సలహా నిచ్చిరి.

అంతట నేను మద్రాసు పోయి, విలియమ్స్ పిళ్ల గారిని స్కాటుదొరగారిని మఱికొందఱిని సందర్శించితిని. జరిగినదానికి వా రేమియును జేయఁజాలకుండిరి. వీరేశలింగము గారితోను బుచ్చయ్య పంతులుగారితోను మాట్లాడితిని. ఇంతలో బెజవాడ వచ్చిన మాతమ్ముఁడు వెంకటరామయ్య నాకు మద్రాసునకు తంతి నిచ్చెను. నాకు పర్లాకిమిడి యుద్యోగమయ్యెననియు ఫిబ్రవరి ప్రారంభముననే నాకళాశాల చేరవలయు ననియును, అం దుండెను ! తల తడివిచూచుకొని, నే నంత బెజవాడ మరలివచ్చితిని.

ఇంకను నాకు దొరతనమువారి కొలువు విషయమై విరక్తి కలుగలేదు ! పైయధికారి యేమియుత్తర మిచ్చునో చూత మని వారికి తంతి నంపితిని. తుదకు 24 వ జనవరిరాత్రి వారియొద్దనుండి ప్రత్యుత్తరము వచ్చెను. నా కిచ్చినపని రద్దుచేసితి మనియు, పర్లాకిమిడి యుద్యోగము నన్నుఁ జేకొను మనియు నాకు వారు తెలియఁబఱిచిరి ! అందుచేత నేను దొరతనమువారి కొలువునం దాశ మానివేసి, బెజవాడయుద్యోగము విరమించుకొని, పర్లాకిమిడి పోవుటకు నిర్ధారణ చేసికొంటిని.