పుట:2015.373190.Athma-Charitramu.pdf/412

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 374

న్యాయవాది పరీక్షాఫలితములు 18 వ మార్చిని తెలిసెను. నేను తప్పిపోయితిని. వెంకటరామయ్య వెనుకటివలెనే రెండవతరగతిలోనే జయమందెను. రాజధాని యంతటిలోను మొదటితరగతిలో నొక్కరే గెలుచుటయు, నావలె రెండవతరగతి పరీక్షకు వచ్చినవారందఱు నపజయము గాంచుటయు, ఈపరీక్షలోని యైదుభాగములలో రెండింట నేను గృతార్థుఁడ నగుటయును, నాకుఁ గొంత యుపశమనము గావించెను !

'ఏలూరు యువజనసమాజ'సభలో వొక యుపన్యాస మీయుఁడని నా కిపుడు పిలుపువచ్చెను. "బాల్యస్వర్గము" అను విషయముపై నేనొక యాంగ్ల వ్యాసము వ్రాసి, 8 వ ఏప్రిలున ఏలూరులో జరిగిన సభలోఁ జదివితిని.

కొలఁది రోజులలోనే రాజమంద్రి ప్రార్థనసమాజవర్థంతి జరిగెను. ఆ సమయమున (15 వ ఏప్రిలు) మా తమ్ముఁడు "భూలోక స్వర్గము" అను తెలుఁగు వ్యాసమును, నేను "వీరసంస్కర్త" అను నాంగ్లవ్యాసమును జదివితిమి. వీరేశలింగముగారి జీవితవిమర్శనమే నా ప్రసంగమునకు ముఖ్యవిషయము. అఱవపల్లి సుబ్బారావుగారు మున్నగు విద్యాధికులు మెచ్చుకొనిరి గాని, నామిత్రుల కంతగ నారచనము రుచింపలేదు. 'పెరటిచెట్టు మందునకు రాదుగదా' యని తలపోసి నే నూఱడిల్లి తిని.

38. "బాల్యస్వర్గము"

మనుజుని రచనములు వాని యాలోచనముల ప్రతిబింబములు. 1900 వ సంవత్సరప్రాంతములందలి నాయూహాపోహములకును, ఆశయములకును, నే నాసంవత్సరమున లిఖియించిన రెండువ్యాసములు