పుట:2015.373190.Athma-Charitramu.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32. మనస్తత్త్వ పరిశోధకసంఘము 351

32. మనస్తత్త్వ పరిశోధక సంఘము

మాతండ్రి చనిపోయిన మొదటి దినములలో దు:ఖాతిరేకమున నాకు మతి తొలఁగిపోవునటు లుండుచువచ్చెను. మొన్న మొన్నటి వఱకును ఆరోగ్యానందము లనుభవించి మనుచుండెడి జనకుఁ డింత వేగమె మటుమాయ మగుట నా కాశ్చర్య విషాదములు గొలిపెను. మృత్యువుతో మన మనోవృత్తు లన్నియు నశించునా, లేక పిమ్మటకూడ నవి వేఱు పరిస్థితులలోఁ గార్యకలాపము సాగించునా యని నేను దలపోయువాఁడను. నేనా దినములలో నొకప్పుడు రాజమంద్రిలో "ఇండియన్ మెస్సెంజరు" పత్రిక చదువుచుండఁగా దానిలో "లండను మనస్తత్త్వ పరిశోధక సంఘము" వారి యొక్క నూతన గ్రంథ విమర్శనము కానఁబడెను. అది నే నతి కుతూహలమునఁ జదివియుఁ దనివి నొందక, ఏతత్గ్రంథకర్తయగు రిచర్డుహాడ్జిసను గారికి తమపుస్తకప్రతి నాకుఁ బంపుఁడని అమెరికాకు వ్రాసితిని. ఆయన నాకుఁ బంపిన పుస్తకము ప్రేమపూర్వకమగు లేఖయును, 1899 సంవత్సరము జనవరి 30 వ తేదీని నా కందినవి. ఆసాయంకాలమునుండియే నే నాగ్రంథపఠన మారంభించితిని. రాత్రులందును, పగలు పాఠశాలలో తీఱిక సమయమందును, నే నా పుస్తకమును జదువుచుండువాఁడను. అందలి "జి. పి. సందేశములు" అనుభాగము అత్యద్భుతముగ నుండెను. ఈవార్తలే యధార్థ మైనచో, మనస్సునకు మరణానంతరదశ కల దనుట స్పష్టము. హాడ్జిసనుగారికి నేను బుస్తకపువెల నంపుచు, పైపరు దొరసానిగారిని మాతండ్రిని గూర్చి ప్రశ్నలడుగుటకై యాయన జాబులు నే నంపవచ్చునా యని వ్రాసితిని.