ఆత్మ చరిత్రము 346
"మా జనకుని పవిత్ర జీవితము మాసోదరు లందఱికిని పరస్పర ప్రేమముఁ బురికొల్పును గాక! మా తండ్రి కీలోకమున సమకూరని శాంతి సౌఖ్యములు పరాత్పరుని సన్నిధానమునఁ బ్రసాదిత మగునుగాక!"
నా ప్రసంగానంతరమున మిత్రులు పెద్దాడ సాంభశివరావు గారు మా జనకుని సౌజన్యమును గూర్చి ముచ్చటించిరి. అగ్రాసనాధిపతియగు పాపయ్యగారు మానాయన సుగుణములను బ్రశంసించిరి. ఎన్నఁడుగాని తనకుమారులు చెడువార లనియు నాస్తికు లనియు మాతండ్రి మొఱలిడలేదని వారు చెప్పిరి. అమిత సహన సౌజన్యములు గలిగి మాజనకుఁడు మనుచుండెడివాఁడని పాపయ్యగారు వక్కాణించిరి.
31. ప్రాథమిక పరీక్ష
మాతండ్రి చనిపోయిన చాలకాలమువఱకును, నా కాయనను గుఱించి భయంకరమగు కలలు వచ్చుచుండెడివి. మా కిపుడు కష్టపరంపర సంభవించె ననియు, మాతల్లి మున్నగు వారును మృతి నొంది రనియు నేను సుషుప్త్యవస్థయందు భ్రమనొందుచుండువాఁడను. ఇపుడు సంవత్సరపు తుదిదినము లగుటచేత మా పాఠశాలకుఁ బరీక్షలు చేయఁజొచ్చితిమి. నామిత్రులు వెంకటరత్నము నాయఁడుగారు కృష్ణామండలపూర్వభాగమునకు ప్రాథమిక పరీక్షాధికారిగ నియమింపఁబడిరి. ఆయన నన్నును, మఱికొందఱు స్నేహితులను సహాయ పరీక్షాధికారులుగ నియమించిరి. అందువలన నించుక ధనలాభమె కాక, మనసునకుఁ గొంత విరామమును, వారియొక్కయు నితర స్నేహితులయొక్కయు నమూల్య సహపాస భాగ్యమును నాకు లభించెను.