Jump to content

పుట:2015.373190.Athma-Charitramu.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14. ప్రాఁతక్రొత్తలు 269

నిమిత్తమై వెంకటరామయ్య మద్రాసు వెడలిపోయెను. మేము బెజవాడకు మరలివచ్చితిమి.

14. ప్రాఁతక్రొత్తలు

కడచిన సంవత్సరమున నేను జేసిన పనులను విమర్శించుకొనుచు, 1896 వ సంవత్సరము జనవరి మొదటితేదీని నేనొక పట్టికను వ్రాసికొంటిని. అందులో గత సంవత్సరమున పరీక్షకొఱకును వినోదార్థమును జదివిన పుస్తకములఁ బేర్కొని, ముందు సంవత్సరమునఁ జదువఁ బూనిన ముఖ్యగ్రంథముల నామముల నుదాహరించితిని. గతసంవత్సరము నేను జదివిన యుద్గ్రంథములలో ముఖ్యములైనవి, మిల్లువిరచితమగు "మతవిషయికవ్యాసత్రయము", కార్లయిలుని "సార్టారు రిసార్టను", ఇమర్సునుని "మానుష ప్రతినిధులు", రీననుని "క్రీస్తుజీవితము"ను, మిత్రుఁడు రామమూర్తిగారి సహవాసమహిమముననే నా మనస్తత్త్వమున కిపుడు ఇమర్సను, కార్లయిలులు సరిపడుట చేత, ఈసంవత్సరము కార్లయిలుని "శూరులు" "భూతవర్తమానములు" అను పుస్తకములు చదువ నేర్పఱుచుకొంటిని. తమ్ముఁడు కృష్ణమూర్తి రాజమంద్రిలో నున్నప్పటికంటె జ్ఞానశీలాదులంయం దభ్యున్నతి నొందుచుండెను. ఈ సంవత్సర మాతని గుఱించి నే నెక్కువగ శ్రద్ధ వహించి, ప్రవేశపరీక్షలో నాతఁడు జయమందునట్లు చేయ నుద్యమించితిని. భార్య విద్యావిషయమైకూడ మిగుల పాటుపడి, మత సంఘ సంస్కరణములయం దామె కభిరుచి కలిగింప నుద్యమించితిని.

ఆ కాలమున నా దేహమును బీడించు పెనుభూతమగు మలబద్ధమును నిర్జించుటకై, నిద్రాభోజనాదులందు మితత్వముఁ గలిగి, నిత్య