పుట:2015.373190.Athma-Charitramu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48. ఆస్తిక పాఠశాల 207

యల్. టి. పరీక్షలు జరిగెను. మే మంతట బయలుదేఱి, రాజమంద్రి వచ్చివేసితిమి.

మృత్యుంజయరావున కంతట బెజవాడక్రైస్తవపాఠశాలలో నుద్యోగమై, యతఁడు వెడలిపోయెను. ఇంతలో మే మిరువురమును యల్. టీ. పరీక్ష మొదటిభాగమున జయ మందితి మనువార్త వచ్చెను. అంత మేము రెండవభాగమందలి పరీక్షకుఁ బోయితిమి. మార్చినెలలో పరీక్షా ఫలితములు తెలిసెను. మిత్రుఁడు జయ మందెను ; నేను దప్పి పోయితిని. అంతట, మృత్యుంజయరావు బెజవాడలోని యుద్యోగము వదలి, ప్రథమోపాధ్యాయుఁడుగ యలమంచిలి వెడలిపోయెను. తన పాఠశాలలోనే నా కీయఁబడిన రెండవయుపాధ్యాయపదవి స్వీకరింపుమని యతఁడు నాకు బోధించెను. మనసు గలియని మేమిరువురము నొకచోట నుద్యోగముఁ జేయుట మంచిది గాదని నాకుఁ దోఁచెను. ఈప్రాంతములందు నా కుద్యోగము లభింపనిచో, హైదరాబాదు వెడలిపోవఁదలచితిని. నాయవస్థనుగుఱించి నేను మిగుల విచారపడితిని. అంతట, మార్చి 8 వ తేదీని బందరునుండి నాకు తంతి వచ్చెను. బెజవాడక్రైస్తవపాఠశాలలో డెబ్బదిరూపాయలు వేతనముగల యుద్యోగము నా కీయఁబడెను. దైవమునకు నామీఁద నెట్ట కేలకు దయ కలుగుటకు నేను ముదమందితిని.

9 వ మార్చితేదీని ప్రొద్దున నేను రాజమంద్రినుండి బయలుదేఱి, మధ్యాహ్నమునకు బెజవాడ చేరి, పాఠశాలా ప్రథానోపాధ్యాయులగు శ్రీధన్వాడ అనంతముగారినిఁ జూచితిని. ఆయన సజ్జనులు. నాకెంతో దయ గనఁబఱిచిరి. నేను ఉద్యోగమునఁ జేరితిని. నాకుఁ జూపినకృపావిశేషమునకు దేవదేవునికి హృదయపూర్వక నమస్కృతు లొనర్చితిని.