పుట:2015.373190.Athma-Charitramu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మ చరిత్రము 132

కొనిన 'ఈసపుకథల'ను తెలిఁగింప మొదలిడితిని. ఈవిధముగ నేను చెన్నపురిలోఁ గొన్నికథల ననువదించితిని.

5 వ తేదీసాయంకాలము వీరేశలింగము బుచ్చయ్యపంతులు గార్లకు అద్వైతమతమునుగుఱించి పెద్దచర్చ జరిగెను. బుచ్చయ్యపంతు లిపుడు అద్వైతమతాభిమాని. వీరేశలింగముగారి మనస్తత్వమున కామతము బొత్తిగా సరిపడకుండెను. దానియం దణుమాత్రమును సత్యము లే దని యాయననిశ్చితాభిప్రాయము. అంత బ్రాహ్మధర్మమందలిలోపములను బుచ్చయ్యపంతులుగారు వెలువరింపఁగా, వీరేశలింగముగారు వారివాదమును ఖండించిరి. నేను వీరేశలింగముగారి పక్షమునే యవలంబించితిని.

6 వ తేదీని, ఈయిరువురు మహాశయులయొద్దను, జననులవలె నిన్నాళ్లును నాకు భోజనసౌకర్యములు గలిగించిన వారిసతీమణుల యొద్దను, నేను సెలవు గైకొని, మద్రాసునుండి బయలుదేఱితిని. వెనుకటి యనుభవములు మఱచిపోయి, నాస్వాభావికరుచుల ననుసరించియె, పొగయోడలో భుజించుటకు తీయని యుపాహారములే యీమాఱును నేను వెంటఁదీసికొనిపోయితిని ! కాని, యోడలో పయనము చేయుచుండు నామిత్రుఁ డొకఁడు, సముద్రయానమందు పైత్యోద్రేకకరములగు మధురపదార్థములు పనికిరావని నాకుఁ జెప్పి, తాను దెచ్చుకొనిన పచ్చడియూరుగాయలతోఁ గలిపినయన్నము నాకుఁ బెట్టెను. ఈమాఱు నాపయనము హాయిగ నుండెను. 8 వ తేదీమధ్యాహ్నము కాకినాడ తీరము చేరి, బండిమీఁద మఱునాఁటి సాయంకాలమునకు రాజమంద్రి వచ్చితిని. సుఖముగ నే నిలు చేరినందు కందఱు నానందపరవశులైరి.