ఆయన ఓఢప్రాంతపు 'ధల్లి, రాజహర' కొండలందు ప్రశస్తమగు నినుము సమృద్ధిగ కలదని, 1887 లోనే యొక ప్రభుత్వపు రిపోర్టులో వ్రాసియుండెను. 1904 లో తిరిగి తిరిగి వేసారి యేమియు తోచక, మనత్రిమూర్తులు నాగపురముజేరి, అందలి గ్రంథాలయములోనికిబోయి, కాలయాపనకని అందు బూజుపట్టిన యొకపుస్తకమును తీసిరి. అది వసువురిపోర్టేయగుట తటస్థించెను. దానిని చదివి యచ్చెరువొంది, వారు ముగ్గురును ఆకొండల యొద్దకు తక్షణమే పోయి, పరీక్షించిరి. వెంటనే యాగనుల పనికై ప్రభుత్వమునుండి లైసెన్సు బొందిరి. ఆకొండల దృశ్య మత్యద్భుతము; ఆప్రాంతమంతయు అయోమయమే. ఆయినుము చాల ప్రశస్తము పరిశుద్ధముగ నుండెను. 'ఝరియా' బొగ్గు గనులును దీనిసమీపమందే యున్నవి. వెంటనే, ఆయినుము బొగ్గుల మచ్చుల దీసికొని, వానిని వా రమెరికాకు పరీక్షకై పంపిరి. వానితో ప్రశస్తమగు ఉక్కు తయారగునని యా పరీక్షచే తెలియవచ్చెను.
కాని యాప్రాంతమున నీరులేదు. పెద్ద యినుప కార్ఖానాలు పనిచేయునప్పుడు, అందలి బ్రహ్మాండమగు కొలుముల వేడిని తగ్గించుటకు, సంతతము నీరు పోయుచుండవలెను. అచట నది మొదలగు నీటివసతి లేనందున చిక్కుకలిగెను. ఇంతలో, అమెరికానుండి 'పెరిను'గా రచటకు చేరిరి. జంషెడ్జితాతా 1904 మే నెలలో చనిపోయినను, ఆయనకుమాళ్ళు విడువక,