పుట:2015.328620.Musalamma-Maranam.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముసలమ్మ మరణము

23

సీ. కన్నెఱ్ఱవారిన ఖరకరోదయకాల
       మల్లనమ్రింగు జాబిల్లియనఁగ
    జ్వలదగ్ని శిఖలపై నెలనవ్వుతోఁ బోవు
        ధాత్రీ మహాదేవి తనయ యనఁగ
కెందారమరలబారు సుందరమగు లీల
      నల్లనల్లనఁ జొచ్చు నంచ యనఁగ
కాల మహాస్వర్ణ కారకుం డగ్నిలోఁ
      గరఁగించు బంగారు కణికయనఁగ
గీ. ప్రళయ కాలానల ప్రభాభాసురోగ్ర
   రంగ దుత్తుంగ భంగ సంవ్రాతములకుఁ
   గలఁక నొందక, దరహాస మలర, మంద
   మందగతి బోయి, చొచ్చె నమ్మగువనీట. 104

గీ. ఇచట నస్తమించి యినుఁడు పశ్చిమగోళ
    మందు వెలుఁగు గాదె? యట్టెదేవ
    భువనముననుఁ బొలుచు ముసలమ్మ యాంధ్రభా
    షాభిరంజనిం దయఁగనుఁ గాత. 105

ఏ. శివమై, చిన్మయమై, యఖండమయి, యర్చిన్మంతమై, నిత్యమై,
    భవపాథోనిధినావయై, మునిజనప్రాణంబునై, యద్భుతా
    ర్ణవమై, నామనికారరూపరహిత ప్రాశస్త్యమై, వెల్గు వి
    ష్ణు విరించీశ్వరనాథతత్త్వము మమున్ శోభిల్లఁగాఁ జేయుతన్.

ఏ. ఇది కట్మంచి నివాసుఁ, డార్యజన మైత్రీచ్చాభిరాముండు, ధ
    ర్మదయాశోభిత పాకనాటికుల సుబ్రహ్మణ్య పుత్త్రుండు, దు
     ర్మదదూరుండును, ప్రీతబంధుఁడవు రామస్వామికిన్ స్వీకృతుం,
     డుదితామోదముమై రచించె విహితప్రోత్సాహ సాహాయ్యుఁడై.