పుట:1857 ముస్లింలు.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్తిగా హస్తగతం చేసుకున్నా తిరుగుబాటు యోధులంతా తిరిగి లక్నో కేంద్రంగా ఏకమౌతున్న తీరును చూసి ఆంగ్లేయులు బెంబేలెత్తారు. ఈ వ్యతిరేక పరిణామాలతో బేగంపై కత్తిగట్టిన కంపెనీ పాలకులు అవధ్‌ను అపార సైనిక బలగాలతో ముట్టడించినా, ఏమాత్రం అధైర్యపడక ఆమె స్వయంగా రణరంగ ప్రవేశం చేసి, తన సైనిక దళాలను ముందుకు నడిపి వీరోచితంగా పోరాడారు.

ఆ సమయంలో సిపాయీలను, స్వదేశీ పాలకులను మంచి చేసుకునేందుకు బ్రిటన్‌ మహారాణి విక్టోరియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలోని కుటిలత్వాన్నీ, అందులోగల అవాస్తవికతనూ వెల్లడి చేస్తూ బేగం హజరత్‌ మహల్‌ తన కుమారుడు బిర్జిస్‌ ఖదీర్‌ పేరిట చరిత్రాత్మక ప్రకటనను జారీ చేశారు.

ఆ ప్రకటనలో స్వదేశీయుల ఆత్మాభిమానాన్ని ఆంగ్లేయులు ఏవిధంగా దెబ్బ గొట్టిందీ, స్వదేశీయుల మతధర్మాలను ఏవిధంగా కించపర్చిందీ, ప్రజా సమూహాల మత మనోభావాలను ఏ విధంగా అవమాన పర్చిందీ, తిరుగుబాటుకు భయపడి తిరగబడ్డ సైనికులను, నేతలను మాలిమి చేసుకునేందుకు ఎలాంటి ఆశలు చూపిందీ, గతంలో స్వదేశీ పాలకుల విూద ఎంతటి అఘాయిత్యాలకు పాల్పడిందీ, ఎన్నిసార్లు మాట తప్పి వ్యవహరించింది ఆ సుదీర్ఘమైన చారిత్రాత్మక ప్రకటనలో తగిన సాక్ష్యాధారాలతో సహా ఆమె సాధికారికంగా వివరించారు.

చివరకు మా ప్రజలు మాదేశాన్ని కోరుతున్నప్పుడు ఆమె మాదేశాన్ని మాకెందుకు వదలి పెట్టదూ? ( '..Why does her Majesty not restore our country to us. when our people want it..' - Encyclopaedia of Women Biography, Vol. II, P.66) అని సూటిగా విక్టోరియా రాణిని బేగం హజరత్‌ మహల్‌ ప్రశ్నించారు. విక్టోరియా రాణి మభ్యపెట్టే మాటలను నమ్మవద్దని, మోసపోవద్దని ప్రజలకు, స్వదేశీ పాలకులకు ఆమె విజ్ఞప్తి చేశారు. మాతృభూమి విూద పరాయి పాలకులు సాగిస్తున్న పెత్తనాన్ని తుడిచి పెట్టేందుకు కంకణబద్ధులై కదలాలని ప్రజలను కోరారు.

అత్యంత ధైర్యసాహసాలతో, అద్భుతమైన విజ్ఞతతో, పరిపాలనా దక్షతతో ఆవథ్‌ రాజ్యాన్ని పాలిస్తున్న బేగంను ఎలాగైనా పరాజితను చేయాలని ఆంగ్లేయ సైనికాధికారులు వ్యూహం పన్నారు. అవధ్‌ను ఆక్రమించుకునేందుకు భారీ సంఖ్యతో చుట్టుముట్టడంతో బ్రిటీష్‌ సైనికమూకలను ఎదుర్కొనడం చాలా కష్టతరమైన తరుణంలో కూడా ఆమె