పుట:1857 ముస్లింలు.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

దృష్ట్యా కోట ద్వారాలను మూసి వేయకుండా నిర్లక్ష్యం చేయడంతో, ఇతర ప్రాంతాలనుండి తరలించబడిన ఆంగ్ల సైన్యాలు కోటలోకి దూసుకువచ్చాయి.

ఆ విధంగా వచ్చిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ సేనలు చారిత్రాత్మక వెల్లూరు తిరుగుబాటును దారుణంగా అణిచివేశాయి. ఈ సందర్బంగా 1044 మంది తిరుగుబాటు యోధుల మీద సైనిక విచారణ సాగింది. ఆ విచారణ పర్యవసానంగా సుమారు 350 మందిని కాల్చివేసి వెల్లూరు కోటను ఆంగ్ల సైనికులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ తిరుగుబాటుకు టిపూ సుల్తాన్‌ కుమారుడు ఫతే హైదార్‌ కారకు డని ఆంగ్లేయాధికారులు భావించారు. ఆ కారణంగా టిపూ వారసులను వెల్లూరు నుండి దూరంగా కలకత్తాకు తరలించారు. (Tamils Dispute Indian Mutiny Date, LR Jagdeeshan, BBC News, Madras)

ఈ విధంగా స్వంత గడ్డకు దూరమైన టిపూ వారసులు చాలా దుస్థితిని, పలు కడగండ్లను అనుభవించారు. టిపూ వారసులు చిన్నాచితకా పనులు చేసుకుంటూ బ్రతుకులు వెళ్ళమార్చుతున్నారని కథనాలు వినరాసాగాయి. చివరకు కలకత్తాలో టిపూ వారసులొకరు జట్కాబండిని నడుపుకుంటూ బ్రతుకు బండిని అతి కష్టం మీద నడుకుంటున్నారని పత్రికలు కథనాలను వెల్లడించాయి.

అవథ్‌ నవాబు వాజిద్‌ అలీషాను అవధ్‌ గద్దె నుండి దించేశాక ఆయన వారసు లెవ్వరూ బ్రిటిష్‌ ప్రబుత్వానికి వ్యతిరేకంగా తిరిగి తలెత్తకుండ ఆయన పరివారాన్ని మొత్తంగా లక్నోకు దూరంగా కలకత్తాకు తరలించాలనుకున్నారు. ఆంగ్లేయుల అభీష్టం మేరకు నవాబుతో కలసి కొందరు కలకత్తా వెళ్ళారు. ఆయన భార్య బేగం హజరత్‌ మహల్‌ మాత్రం అవధ్‌ రాజధాని నగరమైన లక్నోలో ఉండిపోయారు. ఆమె ఈస్ట్‌ ఇండియా కంపెనీ మీద తిరుగుబాటు ప్రకటించి ఆంగ్లేయుల నుండి లక్నోను విముక్తం చేసి పది మాసాల పాటు స్వతంత్రంగా రాజ్యపాలన చేశారు. చివరకు పరాజయం పాలైన ఆమె నేపాల్‌ అడవులలో తల దాచుకుంటుండగా 20 లక్షల రూపాయల భరణం ఇస్తామని, లక్నో మీద తమకున్న వారసత్వ హక్కులను వదులుకోమని కంపెనీ పాలకులు ఆమె వద్దకు రాయబారం పంపారు. ఆ ప్రతిపాదానలను తిరస్కరించిన బేగం హజరత్‌ మహల్‌ పలు ఇక్కట్లు పడుతూ చివరకు నేపాల్‌ రాజ్య రాజధాని ఖాడ్మండులో 1874 ఏప్రిల్‌ మాసంలో కన్నుమూశారు.

232