కలం యోధులు
స్వాతంత్య్రసంగ్రామంలో అగ్నికణాల్లా ఎగిసిపడుతున్న విప్లవకారులకు మరింత ఉత్తేజాన్నిస్తూ, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకుల దౌష్ట్యాన్ని తూర్పారప డుతూ, మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను పణంగా ట్టాల్సిన అవసరాన్ని ప్రజలకు నొక్కిచెప్పడంలో మౌల్వీబాఖర్ చాలా ప్రముఖ పాత్ర వహించారు.
మౌల్వీ బాఖర్లో చిన్న నాటనే స్వతంత్రభావనలు పొటమరించాయి. విదేశీయుల బానిసత్వంతో మగ్గుతున్నస్వదేశం, స్వదేశీయుల పరిస్థితి పట్ల ఆయన తీవ్రంగా కలత చెందారు. ఢిల్లీ నగరంలోని ప్రసిద్ధ ఢిల్లీ కళాశాల విద్యార్థిగా ఉన్నత విద్యను పూర్తిచేశాక ఢిల్లీ కళాశాలలో కొంతకాలం అధ్యాపకునిగానూ, ఇతర పలు అధికార పదవులనూ నిర్వహించి చివరకు జర్నలిజం వైపు మొగ్గు చూపారు. అక్షరశక్తి ద్వారా తన ప్రజలను పరాయి పాలకులకు వ్యతిరేకంగా చైతన్యవంతుల్ని చేయాలని సంకల్పించారు. ఆ ఆలోచనల ప్రకారంగా చేసున్నఉన్నత ఉద్యోగానికి తిలోదాకాలిచ్చారు. ప్రజలను ఉత్తేజితుల్నిచేస్తూ స్వతంత్ర జీవనానికి మార్గదర్శకం చేసే సమాచారాన్ని ప్రజలకు మరింత చేరువచేయాలని భావించిన ఆయన 1836లో ఢిల్లీ ఉర్దూ అఖ్బార్ (Delhi Urdu Akhbar ) ఉర్దూ పత్రికను ప్రారంభించారు. ఈ పత్రికలో ఆనాటి ప్రముఖ కవులు బహదూర్ షా జఫర్, మీర్జా గాలిబ్, హఫీజ్ గులాం రసూల్, మీర్జా ముహమ్మద్ అతీ భక్త్, మీర్జా హైదర్ షికో, మీర్జా జీవన్ భక్త్, మీర్జా నూరుద్దీన్ తదితరులు కవితలు రాశారు. ఈ పత్రిక ద్వారా పలు విషయాల మీద కవులు చర్చలు సాగించారు.
స్వేచ్ఛా-స్వాతంత్య్రాలను కోరుకుంటున్న దెహలీ ఉర్దూ అఖ్బా పత్రిక 1857 మే 10న ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ప్రారంభం కాగానే మరింత చురుకుగా వ్యవహరించడం ఆరంభించింది. ఈ పత్రిక ఢిల్లీ కేంద్రంగా ప్రచురితమౌతున్నా, పలు ఇతర ప్రాంతాల సమాచారాన్ని రాబట్టుకునేందుకు తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఇతర ప్రాంతాల సమాచారాన్ని కూడ ప్రచురిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. తిరుగుబాటుకు సంబంధించిన విశేషాలను సేకరించి వాటిని 'సంగ్రామ విశేషాలు' అను శీర్షికతో ప్రత్యేకంగా ప్రచురించటం ఆరంభించింది. తిరుగుబాటు బాగా ఊపందుకున్న ఢిల్లీ, అంబాలా, మీర్, షహరాన్పూర్ లాంటి పలు ప్రదేశాలలోని పోరాటాల వివరాలను పాఠకులకు అందించింది.
123