కాళిదాస చరిత్ర
81
కాళిదాసున కట్టియమేయగౌరవము జరుగుటవలన నాస్ధాన కవిత్రయమునకు మితిలేని యసూయజనించెను. అందుచేత వారిలోవారు కూడబలుకొని భోజుని యెట్టయెదుట నిలిచి కాళిదాసుని గర్వభంజనముచేయఁదలఁచి యిట్లనిరి— “మహారాజా! ఈకాళిదాసు దేవరవారిమీఁద స్తోత్రపూర్వకముగాఁ జదివిన ‘మహారాజా, శ్రీమాన్‘ అను శ్లోకము మొదలుకొని నాలుగుశ్లోకములు కాళిదాస విరచితములు కావు. పూర్వమహాకవికృతములు. అవి విక్రమార్కునిమీఁద నే మహాకవియో చెప్పఁగా వాటినిసంగ్రహించి, కాళిదాసుఁడు పూర్వరాజుపేరు తీసివైచి మీపేరుచేర్చి పఠించెను. ఈశ్లోకములు కంఠపాఠముగా మాకువచ్చును. పరగ్రంధచోరుఁడైన యీ పండితుని మహాకవీశ్వరుఁడని కడుంగడు గౌరవించి చిరకాలమునుండి మీ యాస్థానముననుండి సకలదేశప్రఖ్యాతులమై, సాహిత్యచక్రవర్తులమై, కవిసార్వభౌములమైన మమ్ము నిరసింఛుట దేవరవారివంటి విద్వత్ప్రభువులకు భావ్యముకాదు“ అని విన్నవింప దండతాడితమైన మహాసర్పమువలె లేచి కాళిదాసుఁడు భోజమహీపాలునితో నిట్లనియె— “రాజేంద్రా! ఈపండితులు కవితామండితులయ్యు మీచేత దండితులుగానర్హులు. ఏలయందురా! వీరిలో నొకఁ డేకసంతగ్రాహి, రెండవాఁడు ద్విసంతగ్రాహి మూఁడవాఁడు త్రిసంతగ్రాహి. అందుచేత నెవ రేక్రొత్తపద్యము చేసికొని వచ్చినను నిది పూర్వమున్నదే యని తక్షణమే బుద్ధివైభవముచేత నప్పుడే చదివి యనేక పండితులను, విద్వత్కవులను, మీదర్శనము చేయింపకయే వచ్చినవారిని వచ్చినట్లు బంపుచువచ్చిరి. ఎంతోమంది వీరిమాయలలోఁబడి మీదర్శనముగాక యుస్సురనుచుఁ బోయిరి. నాకుమాత్రము మీదర్శనమగునా! మాలిన్యము మాలిన్యముచేతనే శుద్ధియగునట్లు మాయ మాయచేతనే జయింపవలెనని, నే నేమియు నేరని పరమమూర్ఖునివలె వీరికడకుఁబోయి దర్శనముచేసి యొక వెఱ్ఱిమొఱ్ఱి