పుట:హరవిలాసము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక.

9


గుఱించి విచారణీయాంశము లనేకము లున్నను విస్తరభీతీచే సంగ్రహముగ వివరించెద.

శ్రీనాథుఁడు శ్రీ శ. 1397 సం. మొ. 1422 సం. వఱకు రాజ్యము చేసిన ఫిరోజిషా కాలమునను 1382 సం. మొ. 1399 సం. వఱకు రాజ్యమొనర్చిన కుమారిగిరి వసంతభూపాలు కాలమునను, 1379 సం. మొ. 1401 సం. వఱకు కర్ణాటసింహాసనాధిష్ఠితుఁడైన హరిహరరాయల కాలమునను, 1422 సం. మొ. 1435 సం. వఱకు కల్బరిగ రాజ్యమును బాలించిన యహమ్మదుషా కాలమునను, అల్లాడభూపతి పుత్త్రులును, 1426 సం. మొ. 1450 సం. వఱకు రాజ్యముఁ బాలించిన వేమారెడ్డి - వీరభద్రారెడ్లకాలమున నున్న ట్లీకవిగ్రంథములవలనఁ దెలియుచున్నది. ఈవీరభద్రారెడ్డియు వేమారెడ్డియు మరణించిన పిదపఁ గొంతకాలమునకుఁ గృష్ణాతీరములోని బొడ్డుపల్లె యనునొక గ్రామమును గుత్తచేసి నదీప్రవాహమునఁ బైరుగొట్టుకొనిపోఁగా రాజునకు గుత్తధనముఁ జెల్లింపలేక వారిచేఁ బలుబాధల నొంది యవసానకాలమున మిక్కిలి బీదతన మనుభవించెనని మెకన్జీదొర యుదాహరించిన స్థానికచరిత్రలోని శ్రీనాథకృతము లగు నీరెండు పద్యములవలనఁ దెల్లమగుచున్నది.

సీ. “కవిరాజుకంఠంబుఁ గౌఁగిలించెను గదా పురవీథి నెదురెండఁ పొగడదండ
    సార్వభౌమునిభుజాస్తంభ మెక్కెను గదా నగరివాకిటనుండు నల్లగుండు
    ఆంధ్రనైషధకర్తయంఘ్రియుగ్మమ్మునఁ దగిలి యుండెను గదా నిగళయుగము
    వీరభద్రారెడ్డివిద్వాంసుముంజేత వియ్యమందెను గదా వెదురుగొడియ

తే. కృష్ణవేణమ్మ కొనిపోయె నింతఫలము, బిల బిలాక్షులు దినిపోయెఁ దిలలు పెసలు
   బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి, నెట్లు చెల్లింతు టంకంబు లేడునూర్లు.

సీ. కాశికావిశ్వేశుఁ గలిసె వీరారెడ్డి రత్నాంబరంబు లేరాయఁ డిచ్చుఁ
   గైలాసగిరిఁ బండె మైలారువిభుఁ డేగి దినవెచ్చ మేరాజు తీర్పఁగలఁడు
   రంభఁ గూడెఁ దెనుంగురాయరాహుత్తుండు కస్తురి కేరాజుఁ బ్రస్తుతింతు
   స్వర్గస్థుఁ డయ్యె విస్సనమంత్రి మఱి హేమపాత్రాన్న మెవ్వనిపంక్తిఁ గలదు

తే. భాస్కరుఁడు మున్నె దేవునిపాలి కరిగెఁ, గలియుగంబున నిఁకనుండఁ గష్టమనుచు
   దివిజకవివరుగుండియల్ దిగ్గురనఁగ, నరుగుచున్నాఁడు శ్రీనాథుఁ డమరపురికి.