పుట:హంసవింశతి.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxxv


సమాధానపడుద మన్నను, 'భక్తుఁ డీపని చేయవచ్చునా?' యను బాధయే మిగులుచున్నది.

ఇరువదవరాత్రి కథ వింతకథ. మంత్రి కుమారుఁడు స్త్రీ విముఖుఁడు. "ఆఁడు రూపములు వ్రాసిన యింటను నిల్తురే బుధుల్?" అనువాఁడు. మఱి తన తల్లియొడిలో నెట్లు పెరిగి పెద్దవాఁ డయ్యెనో! పెండ్లి యొల్ల ననువాని నొప్పించి, పెద్ద లిద్దరు పెండ్లముల నంటఁగట్టినారు. అతఁడు వారిని ఒంటి కంబపు మేడలోఁ బెట్టినాఁడు కనుక లోలోపల సొరంగములు త్రవ్వుకొనిపోయి, ఱంకాడుటకు వీలులేదు. ఆకసమున నెగిరి పోవుటకు స్త్రీలకు ఱెక్కలు లేవు కదా! ఱెక్కలు లేకున్నను వారు గగనయానము చేసిరి. మగని కంటఁబడి, వానికి మసిబూసి తప్పించుకొనిరి? ఈ కథ తక్కిన కథల వంటి సాధారణ కథ కాదు; స్వాభావిక కథ కాదు. దీనిని వానితో జోడింపకుండిన బాగుండెడిది. పింగళి సూరన్న విద్యమీఁది మక్కువ మనసును బీకుటచే మన కవి యీ కథ కల్పించి యుండును.

ఛందో వ్యాకరణ స్ఖాలిత్యములు

దక్షిణాంధ్రదేశమున యక్షగాన సాహిత్య నికుంజములు తీవలుసాఁగి దేశీయ సంస్కృతి సంప్రదాయ సౌరభములు గుబాళించు కాలమునఁ బుట్టిన ప్రబంధములలో ఆ వాసన పుంజుకొన్నది. పద్యమునఁ గొన్ని మెత్తనిమాటలు పొదుగుట, పాటవలె నడిపింపఁజూచుట, ఛందోవ్యాకరణ నియమాదుల అంత గణింపకుండుట అప్పుడే మొదలైనది. రచన మాధుర్య గుణ ప్రధానము గనుక రసికులను ముగ్ధులను జేయుసు. తేనె మాక్షికమే యైనను సేవ్యము కదా!

దక్షిణ శృంగార ప్రబంధముల క్రేవకుఁ జెందినదే హంసవింశతి.

యతి భంగములు

తే. ఉగ్ర భీమాది నామధేయ ప్రసిద్ధ. (1-168)