పుట:హంసవింశతి.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము 327



ఝణ ఝణం కృతులఁ గంకణములు మెఱయంగ
ఘనఘన ధ్వనుల మేఖల నటింప
ధగధగద్దీప్తి రత్నపు సొమ్ము లలరార
నిగనిగ బావిలీల్ నీటుసూప
తే. భుగభుగలు గల్గు మైపూఁత సొగసు గుల్క
గమగమలఁ గప్రపు విడెంబు గంధ మొలయ
మినమినల్ కుంకుమపు రేఖ మించులొల్క
ఖణిఖణిల్లని మెట్టియల్ కడు రహింప. 370

క. తన కెదురుగ వచ్చిన తన
వనితామణి నపుడు చూచి వదనాంభోజం
బునఁ జిఱునవ్వొలయఁగ నె
మ్మనమున నానందమొందె మానిని యంతన్. 317

తే. విభుని పదములు పన్నీట వేడ్కఁగడిగి
నెచ్చెలులతోడ వెస నివాళిచ్చి వైచి
యింటిలోనికిఁ దో డ్తెచ్చి యింతులెంచ
భర్తతోఁ గూడ నతిసుఖప్రాప్తి నుండె. 372
వ. అంత హేమావతీకాంత వృతాంత మంతయు నాత్మీయదూతి విన్నవించిన విని కంపితశిరస్కుండై కొంత తడవు చింతించి, మహారాజచంద్రుండును నీతిజ్ఞుండును నకళంకుడును వివేకధురంధరుండును గావునఁ జిత్రభోగనృపాలుండు దన మనంబున. 373

ఉ. మున్నల రావణాదులు సముద్ధతి సాధ్వులఁ గోరి యేమి సౌ
ఖ్యోన్నతిఁ జెంది రిట్లగుట నుర్విజనావళు లన్యకాంతలన్
బన్నుగఁ గోరరాదు కడుఁబాతకమంచుఁ దలంచి యింతిపై
నున్నమనంబు ద్రెక్కొని యథోచితపద్దతి నుండె భూవరా! 374