పుట:హంసవింశతి.pdf/391

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము 311



సీ. మంత్రికుమారుఁ డామానధూర్వహుఁడు ది
వ్యౌషధం బవ్వనందిందుఁ గలుగు
టెఱిఁగియుండుటఁజేసి హితమిత్రపరిజనా
న్వితముగ దివ్వటీ ల్వెలుఁగ నేఁగి
బదనికగల పాదపముఁ జూచి యది తీసి
కొనిరండు పొండని కొందఱ హిత
వరుల నంపించి వారరుదెంచు నందాఁకఁ
దా విశ్రమింపఁగాఁ దలఁచి తనదు
తే. సతుల కెప్పుడు సంకేతసదనమైన
తద్వనీమధ్యసద్మంబు దండకరుగఁ
బ్రస్ఫురత్కరదీపికాప్రభలు చూచి
పరులెవరొ వచ్చిరని యుపపతులు వడక. 314

తే. వెఱవకుఁడటంచు వెరవుచే వెన్నుఁ జఱచి
యుపపతుల నిండ్లలోననే యుండఁజేసి
నిలయములనుండి వెలువడి నెలఁతలు తన
కెదురుగా రాఁగ మదిఁ గోప మొదవఁ జూచి. 315

తే. పరులకటు తొంగిచూడను బాటుగాని
దుర్గమస్థలి నుండెడి తోయజాక్షు
లివ్వనంబున కేరీతి నెమ్మె మెఱసి
వచ్చినారను సందియం బిచ్చఁబూని. 316

తే. “ఇమ్మహానిశి నిచ్చోటి కేమిపనికి
వచ్చితి?”రటంచు గద్దించి హెచ్చరించు
వల్లభునితోడ నవ్వేళ వనిత లెట్లు
బొంకిపోవలె? నెఱిఁగింపు పంకజాక్షి! 317