xxxiv
తే. బ్రక్కలోఁజేరి కౌఁగిఁటఁ జిక్కఁబట్టి
కులుకు గుబ్బల నెద ఱొమ్ముఁగ్రుమ్మి క్రుమ్మి
రతి బలాత్కారమునఁ జేయ ధృతివహించు
ప్రేయసిని జూచి రోయుచుఁ ద్రోయునతఁడు. (3-201)
పదునాఱవ రాత్రి కథలో నొక బెస్తవాఁ డున్నాఁడు.
తే. మేలు బలువాలుగల నేలు మిసిమిఁగ్రాలు
కన్నుగవడాలు మరునాలు కరణిఁబోలు
మురిపెముల ప్రోలు కలదొక్క ముద్దరాలు
వాని యిల్లాలు దొమ్మరవాని డోలు. (4-139)
వాలుగలు చేపలు. ఆమె లోచనకాంతి వాలుగల నేలుచుండెను. అనఁగా ఆమె కన్నులు కన్నులవలె లేవు. మిలమిలలాడు మీనముల వలె నున్నవి. "ఈక్షణే విచలతః కూపోదరే మత్స్యవత్... కామేంగితే యోషితామ్." ఆ కన్నులు ఇంగిత మెఱిఁగించుచున్నవి. మగవానిఁ జూచినచోఁ దట్టుకొన లేదు. కనుకనే “వాని యిల్లాలు దొమ్మరవాని డోలు" అన్నాఁడు. డోలుకు దాపటి దెబ్బ, వలపటి దెబ్బ. ఇంటఁ బతిఁ బయట నుపపతి.
జాలరి చేపలను బట్టి చంపును. వాని చెలి చేపల నేలును. ఇదెట్లు? చేపలు లోచనములకు దీప్తి నిచ్చు నాహారము. విటమిన్ ఏ. ప్రభావము నూహింపవలెను.
పదునేడవ రాత్రి కథలోఁ గుమ్మరి ముద్దుగుమ్మ కుచకుంభము లొక యుత్పలమాలతోఁ బ్రత్యేకముగా వర్ణింపఁబడెను. కుమ్మరి సుంత మృత్పిండముఁ గొని, యింతకుండ చేయుట యెట్లుండునో యూహకందునట్లు పరిణామ పేశలముగా వర్ణింపఁబడెను. కుంభకారున కొక దున్నపోతుండెను. అది పోతరించి, ఉక్కు పోఁతపోసినట్లుండెను. వాని భార్య "యింటి యెనుబోతున కంటె మదంబు హెచ్చి" తలవాకిలి కాఁపురముగా నుండెను. నెర మాటలు - అర మాటలు మాటాడును. నెర మాటలు కలుపుగోలుతనముతో మాటాడు మాటలు