పుట:హంసవింశతి.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288 హంస వింశతి

పందొమ్మిదవ రాత్రి కథ

గాండ్లచేడె ద్విజవటువును గూడుట

క. శ్రీకర మను నొక పురము సు
ధాకర బింబ భ్రమప్రద స్వర్ణమణి
ప్రాకార గోపుర వర
ప్రాకార సువజ్ర కలశమై సిరులొందున్. 201

శా. సాలాగ్రస్థల కేళి తత్పర మహీస్వామ్యర్భక వ్యూహ దోః
పాళీ క్రీడిత రత్నకందుక మహా బాఢ వ్రణావ్యాప్తిచే
నాళీకప్రియ ధీరసారథికి మున్ పాటిల్లి యీనాఁటికిన్
బోలేదయ్యె ననూరునామ మదివో మూలంబు తత్సంజ్ఞకున్. 202

మ. పరిఘాంభః పరిదృశ్యమాన విలస త్పాతాళ సంచార బం
ధుర దర్పోత్కర భోగ రత్న ఘృణి సందోహంబు కెందమ్మి మొ
గ్గ రహిన్ గుల్క హరింపఁ బూని యది రాకన్ దక్కినన్ బల్మఱున్
గరముల్ సాఁచఁగ బోంట్లు, నవ్వుదురు వీఁకన్ వారికేళిన్ సతుల్. 203

తే. ఆ పురంబున ఫణిహారుఁ డనెడు పేరఁ
గాపురము సేయు నొక తిలఘాతకుండు
సంభ్రమంబున నాకార సౌష్ఠవమున
వాఁడు కందర్పునకుఁ జీటి వ్రాయఁగలఁడు. 204

తే. గానుగ కడెంబు మోకులు గడ్డపాఱ
కాఁడి సిద్దెలు గూటంబు కడవ జల్లి
గంప కనుగంత తక్కెడ గట్టి యెద్దు
చుట్టు చవికెయు సర్వ వస్తువులు దనరు. 205