పుట:హంసవింశతి.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xv

పై పెచ్చు జిలుగు తెలుఁగు పలుకుబడి నుడికారము సందర్భోచితముగాఁ బొసఁగించెను.

కావ్యోపక్రమము

"సీతాభర్త నన్ బ్రోవుతన్" అన్నాడు. సీత "శ్రీరామాంశజయైన జానకి". తద్బర్త యెవఁడో చెప్పఁడు: ఆయన ఱొమ్మునఁ బెద్ద యద్దమువంటి మణి యున్నది. జానకి మణ్యభిముఖముగా నుండెనా, ఆమె బొమ్మ యామెకు గనఁబడును. ఆమె గోల. కనుక అన్యకాంతయని గోల చేయును. అదొక బెడఁదఁ ఆ బెడఁదఁ దొల గించుకొనుట కామె యాభిముఖ్యమును బరిహరించి, యామె నంకపీఠిఁ జేర్చినాఁడు. ఆంక శబ్దమునకుఁ దొడయనియే కాదు, సమీపమనియు నర్థమున్నది. అమ్మవారికిఁ బ్రక్కనఁ బీఁట పెట్టించినాఁడు. సీతకు నాలంబమైన యా పేరులేని వ్యక్తి, యేకము నిత్యము విమలము నచలము సర్వధీ సాక్షి భూతము నైన స్థితి పొందినాఁడు. అట్టి పరబ్రహ్మము నన్ బ్రోవుతన్ అని ప్రార్థనము.

నరస భూపాలీయ పద్య మిట్టే యున్నది. కాని, తుది మలుపు వేఱు దానితోఁ దాత్పర్యమే తలక్రిందగుచున్నది. చూడుఁడు.

"శా|| శ్రీ లీలావతి దా నురోమణి సభా సింహాసనత్కౌస్తుభా
      వేలాభా ప్రతిబింబితాంగి యగుచున్ వేఱొక్కతం దాల్చినాఁ
      డౌలే యంచుఁ దరించునోయని, యమందానందుఁడై లక్ష్మీ నే
      వేళం గౌఁగిఁటఁజేర్చు శౌరి నరసోర్వీనాయకున్ బ్రోచుతన్".

ఈ పద్యమున విషయానంద నిష్పందుఁడైన శౌరి-వసుదేవుని తండ్రి పేరు శూరుఁడు, ఆ యింటివాఁడు కృష్ణుఁడు-ప్రోచువాఁ డగును.

హంసవింశతి పద్యము నరసభూపాలీయ పద్యమునకు ఛాయ వలె నున్నదే యను శంక వొడమును. ఈ ప్రాచీన స్రగ్ధరను జూచినచో ఆ ఛాయా శంక తొలఁగును.