Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు

విద్యుదుద్ద్యోతో జలధారాణాం అను పద్యానికి క్రీడాభిరామములో నీ క్రింది పద్యము కలదని శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు తమ పీఠికలో వ్రాసిరి.


మ. “పటు జంఝా పవనోత్తృణాలయములో భద్రంబునం బట్టెకం
     కటిపై ముచ్చము డింగి నిర్భర వియోగగ్లాని శోషిల్లియె
     క్కటి నిద్రించుచునున్న వాడవనితన్‌గర్జా వచః ప్రౌఢిమన్‌ -
     దటి దుద్ద్యోతము సూపునట్టు నడురే ధారాధశ్రేణికిన్‌॥”


శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారిట్లు పీఠికలో రాసినారు. “వంగూరి సుబ్బారావుగారు ఎక్కడ నుండి సంపాదించారో కాని శ్రీనాథుని శాలివాహన సప్తశతి లోనిదని యీ క్రింది పద్యముదాహరించిరి.


'వారణసేయ దావగొనవా, నవనారిజమందు తేటిక్రో।
వ్వారుచునుంట నీవెరుగవా, ప్రియవా తెరగంటి గంటికె।
వ్వారికి గెంపురాదె, తెగవా మగవారల దూర, నీ విభుం!
డారసి నీనిజం బెరుగు నంతకు నంతకు నోర్వు నెచ్చెలీ॥'
కాని యిప్పటి సప్తశతిలో దీనికి మూలమైన ప్రాకృత గాథ కానరాదు”.


నూనూగు మీసాల నూత్న యౌవనమున శాలివాహన సప్తశతి నొడివితి అని శ్రీనాథుడు చెప్పియుండెను. కాని యది యింతవరకు లభ్యము కాలేదు. సప్తశతి పద్యాలను బోలిన ప్రాకృత పద్యాలను కొన్నింటిని మమ్మటాదు లుదాహరించిరి. కాని యవి యెచ్చటివో తెలియదు. ఆర్యా సప్తశతికి దారి చూపినది శాలివాహన సప్తశతియే కాని ఆర్యా సప్తశతి పద్యాలు వీటి ముందర దిగదుడుపుగా నున్నవి. హాలుని గోవర్ధనుడు పూర్తిగా అనుకరించెను. ఇక అమరుక కవి శ్లోకాలను గురించి విచారింతము. అమరుక కవి బహుశ క్రీ.శ. 200 ప్రాంతము వాడై యుండును. అతని కసాధారణకీర్తి కలిగెను. 'అమరుకవే రేకః శ్లోకః ప్రబంధ శతాయతే” అను నానుడి యేర్పడెను. అమరు కవి యొక్కొక్క శోకము నూరు ప్రబంధాలకు సాటియనిరి. అట్టి కవి తన పెక్కు శ్లోకాలలో పూర్ణముగ గాథా సప్తశతి భావములను దింపుకొనెను. భట్టశ్రీ మధురానాథ శాస్త్రిగారు గాథలకును అమరుని శ్లోకాలలో గల సంపూర్ణ సామ్యములను చక్కగా నిరూపించినారు. ఉభయ గ్రంథ శ్లోకాలను పూర్తిగా నుదాహరిం చుటకు వీలులేనందున రెంటిని మాత్రము చూపించి తక్కినవి సూచింతును.