నన్నెచోడుఁడు
నన్నెచోడుని కాలము వివాదఁగ్రస్తము. ఆదిమ కాలమునందీకవి ఏలనో వెలుగుజూడని వాడైనాఁడు. ఇరువదియవ శతాబ్దిదనుక నీతని రచనలకు నవియున్నవను సంగతి తెలియరాలేదు.
తత్కవి కాలవిషయమై స్థూలముగా నాలుగు వాదములున్నవి. పలువురు తదనుగుణ భావవ్యక్తీకరణ గావించిరి. అందు, నన్నయకు బ్రాచీనుఁడుగను, నన్నపార్యునకు సమకాలికుఁడుగను, ఆది కవికిని కవి బ్రహ్మకును నడిమి కాలము వాడుగను, ఉభయకవి మిత్రునికి తరువాతి వాడుగను, గన్పట్టి సందేహపుటూయల యందూగుచున్నాడు.
నన్నపార్యునకు సోమయాజికి నడుమ కాలము వాడని పెక్కురభిప్రాయ మగుటం జేసి తద్రచయితనట్లే స్వీకరించుట ఉచితము.
రచనలు - బిరుదులు- కవితారీతులు
సూర్యవంశ క్షత్రియ, కాశ్యపగోత్ర, చోడబల్లి, హైహయాన్వయాంబర శశిరేఖల యనుంగు పుత్ర, నన్నెచోడ నామాంకిత మహాకవి “టెంకణాదిత్య” - కవిరాజ శిఖామణి” బిరుధేయుడై యొప్పెను.
శివభక్తాగ్రగణ్యుండైన యీతని గురువరేణ్యుడు “జంగమ మల్లిఖార్జును”డుగ గుర్తింపబడినాడు.
అదియునుంగాక నాతడే ఇక్కృతికన్య స్వీకర్త. అచ్చటచ్చట ఈశ్వరునకు సద్గురువునకు నాతడభేదము చూపుట వలనఁబరమేశ్వరుడే ఈతని గురువు కానోపునను సందియమించుక బొడసూపక తప్పదు.
'కుమార సంభవము' కళావిలాసమను కవితా కన్నియం సృష్టించిన నన్నెచోడుడు ప్రప్రథమముగా షష్ట్యంతముల బ్రవేశపెట్టెను.