Jump to content

పుట:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శబ్దాల ముచ్చట

127

అని వ్రాసి యుండెనని యాక్షేపించెను. మరియు తనకు పూర్వుడైన కవి తన చంద్రభాను చరిత్రయందిట్లు వ్రాసెనని యుదాహరించెను.


“ఒక యింతి యొరగిన సికమీద ముడి పువ్వు
టెత్తులు దొరయు తాయెతులు చుట్టి”


చంద్రభాను చరిత్రమును వ్రాసిన తరిగొప్పుల మల్లన కవి క్రీ.శ. 1600 ప్రాంతము వాడని ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు పీఠికలో వ్రాసినారు. తరిగొప్పుల మల్లన ముద్దరాజు రామన కంటే పూర్వకవులెవ్వరును తాయెతు శబ్దమును ప్రయోగించి నటుల కానరాదు. అనగా క్రీ.శ. 1500 తర్వాతనే యీ శబ్దము తెనుగులోనికి ప్రవేశించిన దనవలెను. ప్రవేశించిన దగుటచేత ఇది విదేశీ శబ్దమై యుండవలెను. అప్పకవి భ్రమించినట్లుగా ఇది దక్షిణ దేశీ పదము కాదు. ఎత్తు లేక ఎతు అను పదాలకు దండ (హస్తముపై భాగము) అను నర్థమెందును కానరాదు. నిఘంటువులలో గాని ప్రయోగాలలోగాని ఈ యర్థము కానరాదు.

ఇక ఈ పదమెక్కడిదనగా ఇది అరబీ పదమనవలెను. అరబీలో తావీజ్‌ అను పదము కలదు. అరబీ నిఘంటువులలో దానికర్థము చేతులకు కట్టుకొనే ఖురాను మంత్ర విషయిక రక్ష అని వ్రాసినారు. తెనుగుదేశముపై గోలకొండ సుల్తానుల పరిపాలనము క్రీ.శ. 1512 నుండి స్థిరపడెను. వారి పరిపాలనములో ఫకీరుల ద్వారా హిందువులు తావీజులను పొంది అవి తమకు సకల పీడానివారక రక్షలుగా నుండునని భ్రమించిరి. తావీజు శబ్దమే తెనుగు నోళ్ళలో నలిగి తుదకు తాయెతు రూపము దాల్చెను. దీని పుట్టుకను సరిగా గుర్తించక తానేమో సరిగా నుచ్చరించినట్లు తలచి మల్లనను ఆధారము చేసుకొని ముద్దరాజు రామన్నను తప్పుపట్టిన అప్పకవి శాసనమును ఎవ్వరును అవుగాదనిన వారు కారు.