దాక్షిణాత్య లోకోక్తులు
115
ఇంకా దక్షిణానికి దిగితే శ్రీరంగం అనే పవిత్ర శ్రీవైష్ణవ క్షేత్రం ప్రత్యక్షం అవుతుంది. “శ్రీరంగనీతులు” అనే సామెత తెనుగు వారిలో చాలా ప్రసిద్ధి. అంటే తాము మాత్రము ఆచరింపక ఏమేమో నీతులు బోధించితే అవి శ్రీరంగనీతులు అని మన వారంటారు.
ఇంకా దక్షిణానికి పోతే “ఆడ మళయాళం” లో పడిపోతాము. ఆ ఆడ మళయాళం అనే దేశాన్ని గురించి మన దేశంలో వ్యాపించినన్ని కథలు, కల్లలు మరెచ్చటను లేకుండ వచ్చును. ఈనాడు కూడా పల్లెలలోని జనులు కట్టు కథల నంతా నమ్ముతారు. ఆడ మళయాళంలో అంతా ఆడవాళ్ళేనట. మగవాడు పోతే దక్కడట. అయితే గాలికి పిల్లలు పుట్టుతారట. “మళయాళ భగవతీ” అని మంత్రం వేసినారంటే రాయినో రప్పనో పశువో అయి పోవలసిందేనట. ఇంకా ఇట్టి చిత్ర కథలు కొల్లలుగా మన దేశములో చెప్పుకొంటూ వుంటారు.
మళయాళ మంత్రాలకు ప్రసిద్ధి అయిపోయింది. పూర్వంలో మంత్రగాండ్లు మళయాళం పోనీ పోకపోనీ తమకేమైనా మంత్రాలు వచ్చి వుంటే వాటిని వారు మళయాళంలో నేర్చుకొన్నామని చెప్పుకొనే వారు. అందుచేతనే మంత్రగాండ్లు యిప్పటికినీ మోడీ గారడీ వంటి ఇంద్రజాలాన్ని ప్రదర్శించే దానికి ముందు, “ఛూ, మళయాళ భగవతీ” అని ఆడ మళయాళ శక్తిని తలచుకొంటారు. ఇంకా ఇట్టి సామెతలు మరెన్ని వున్నవో యేమో.